ఒకటో తరగతిలోనే ఉన్నాం, తెలంగాణ మొత్తం రావాలి: కెసిఆర్ (పిక్చర్స్)
మెదక్: కులమతాలకు అతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండి అనుకున్నది సాధించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు పిలుపునిచ్చారు. తాను దత్తత తీసుకున్న మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను ఆయన ఆదివారం సందర్శించారు.
ఇటీవల రెండు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. పరీక్షల అనంతరం 1,100 మందికి అద్దాలు అవసరమని వైద్యులు పేర్కొన్నారు. దీంతో, వారికి ఆదివారం అద్దాలను పంపిణీ చేశారు. కెసిఆర్ కంటి అద్దాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలు తెలంగాణలోని పది జిల్లాలకు పాఠం నేర్పాలన్నారు. అన్నింట్లో ఈ గ్రామాలు ఆదర్శంగా నిలవాలని, సీఎంగా తాను అండగా ఉన్నానని చెప్పారు. గ్రామస్థులు ఐక్యంగా ఉండి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు.
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యం పెట్టుకున్నామని, గ్రామస్థులంతా ఐక్యంగా ఆ గమ్యాన్ని చేరాలనుకున్నామని, మన ప్రయత్నంలో ఇప్పుడు ఒకటో తరగతిలోనే ఉన్నామని, ఈ ప్రయాణం చాలా దూరం వెళ్లవలసి ఉందని చెప్పారు.
కెసిఆర్
ఎర్రవల్లిలో ఇప్పుడు జరిగింది.. జరుగుతోంది... చాలా తక్కువ అన్నారు. గ్రామమంతా బాగు చేసుకుందామనుకున్నామని, ఇందుకు ప్రణాళిక సిద్ధమైందన్నారు. గ్రామంలో కొత్త ఇండ్ల నిర్మాణం కోసం పాత ఇండ్లను కూల్చి వేస్తున్నామన్నారు. దీంతో ఉండటానికి గ్రామస్థులకు ఇబ్బందులు ఏర్పడతాయని, అందుకే తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి టెండర్ల్లు పిలిచారని, నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందన్నారు.
కెసిఆర్
ఇంటింటికీ నల్లా, అన్ని వీధుల్లో హైదరాబాద్ తరహాలో మోరీలు ఉంటాయని, ఇండ్ల నిర్మాణం పూర్తికాగానే ఉగాది సమయంలో కొత్త ఇళ్లలోకి వెళ్లాలన్నారు. బతుకు దెరువు కోసం... వ్యవసాయం ఎలా చేయాలి? ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? అనేది ముఖ్యమని, ఇప్పటికే ఎర్రవల్లికి శాస్త్రవేత్తలు వచ్చిపోయారని, రెండు గ్రామాల్లో తిరిగి ఏ పంటలకు ఏ భూములు అనువుగా ఉన్నాయో పరీక్షల ద్వారా ధ్రువీకరణకు వచ్చారని, ఈ రెండు గ్రామాలను విత్తనోత్పత్తి గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
కెసిఆర్
కావేరీ విత్తన కంపెనీకి గ్రామాలను సీడ్ ప్రొడక్ట్ కోసం ఇచ్చామని, ఆ కంపెనీ వాళ్లే విత్తనాలు ఇస్తారని, పండించిన పంటను కొనుగోలు చేస్తారని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, కంపెనీ ప్రతినిధులు చెప్పింది విని సాగు మెళకువలు నేర్చుకోవాలన్నారు. ప్రధానంగా గ్రామంలో కమతాల ఏకీకరణ జరగాలన్నారు. గ్రామంలో ఒకే రైతుకు వివిధ చోట్ల భూములు ఉన్నాయని, అక్కడో ఎకరా, మరోచోట రెండెకరాలు ఉంటే కుదరదన్నారు.
కెసిఆర్
గ్రామాల్లో నిరుద్యోగులైన వివిధ కులాల యువకులకు 30వరకు ట్రాక్టర్లను ఇప్పిస్తామని, ఆ యువకులే ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లోని భూములను దున్నాల్సి ఉంటుందని, గ్రామస్థులు ఐక్యంగా ఉండాలని, కులం, జాతి అనే అభిప్రాయం ఎవరికీ ఉండొద్దన్నారు.
కెసిఆర్
ఆరోగ్యసమస్యలపై ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, రెండు గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఇప్పటికే కంటి వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. రెండు గ్రామాల్లో 1100 మందికి ఇప్పుడు అద్దాలు అందిస్తున్నామని, క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగానే చేయిస్తామన్నారు.
కెసిఆర్
మరో మూడు రోజుల్లో రెండు గ్రామాల్లో యశోదా హాస్పిటల్స్ యాజమాన్యం మెగా వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకు వచ్చిందని, ఆ రోజు గ్రామస్థులంతా పరీక్షలు చేయించుకోవాలని, మరో ఆర్నెల్ల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
కెసిఆర్
ఎర్రవల్లిలో ఆరోగ్యం, ఊరు, పరిశుభ్రత, పంటలు పండించే విధానం ఇలా ఏది తీసుకున్నా ప్రత్యేకత కనిపించాలన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలే మొత్తం తెలంగాణకు పాఠాలు నేర్పాలన్నారు. తెలంగాణ ప్రజలు రెండు గ్రామాలను చూసిపోవడానికి రావాలని, ఆదర్శంలో రెండు గ్రామాలు పోటీ పడాలన్నారు.