అపెక్స్ కౌన్సిల్ భేటీకి రెడీ అవుతున్న కేసీఆర్..ఏపీ, తెలంగాణా జోలికి రాకుండా..పక్కా ప్లాన్
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రంగం లోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీకి కసరత్తు చేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ ముందు తెలంగాణ రాష్ట్ర వాదన గట్టిగా వినిపించాలని, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల చౌర్యా లను అపెక్స్ కౌన్సిల్ ముందు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీకి దీటుగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్
కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రగతిభవన్లో రేపు మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ . రాష్ట్ర నీటిపారుదలకు సంబంధించిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు తీసుకొని సమావేశానికి హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. ఏపీ నదీజలాల వినియోగం విషయంలో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతుందని , ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు దీటుగా సమాధానం చెప్పాలని కేసీఆర్ పేర్కొన్నారు .
ఏపీ, తెలంగాణా జోలికి రాకుండా వాస్తవాలు కుండ బద్దలు కొట్టాలని ఆదేశం
నదీజలాల విషయంలో ఏపీ మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు అపెక్స్ కౌన్సిల్ ముందు స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు . అపెక్స్ కౌన్సిల్ భేటీకి పకడ్బందీగా సన్నద్ధమై అధికారులు రావాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని నిజానిజాలను దేశం మొత్తం తెలిసేలాగా కౌన్సిల్ భేటీలో మాట్లాడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
కేంద్రం తీరుపై కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్
రెండు రాష్ట్రాలు విభజించబడి ఏడు సంవత్సరాలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాలుగా అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని అపెక్స్ కౌన్సిల్ లో ఎండగట్టాలని సీఎం కేసీఆర్ చెప్తున్నట్లుగా సమాచారం. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటి కేటాయించాలని ,ఇక ఇదే విషయం పై గతంలో తాను ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ కూడా రాసినట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అప్పుడు ప్రధానికి రాసిన లేఖకు ఇప్పటివరకు స్పందన లేదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణా న్యాయమైన డిమాండ్ల సాధనకు అవసరమైనవి రెడీ చెయ్యమన్న కేసీఆర్
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా ప్రశ్నించాలని తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాలని అధికారులకు సూచించారు కేసీఆర్. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వంపై నదీ జలాల విషయంలో ఇప్పటికే యుద్ధం చేస్తున్న కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ ముందు ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది .