తెలంగాణపై కేంద్రానిది వివక్ష.. అందుకే నిధుల కోత: బడ్జెట్పై సీఎం కేసీఆర్ ఫైర్
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్ర బడ్జెట్ లో లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన నిధులు ఇవ్వకపోగా.. కేటాయింపుల్లోనూ భారీగా కోతలు పెట్టడం దుర్మార్గమంటూ కేంద్ర బడ్జెట్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఇవాళ్టి బడ్జెట్ తో మరోసారి తేటతెల్లమైందని అన్నారు.
తెలంగాణ వాటా తగ్గించడం దారుణం
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందనేదానిపై సీఎం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సుమారు 4 గంటలు సమీక్ష నిర్వహించారు. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా తగ్గించడం దారుణమని, బడ్జెట్ లో కేటాయింపులు తగ్గడం రాష్ట్ర పురోగతిపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని సీఎం కేసీఆర్ అధికారులతో అన్నారు. మోదీ సర్కారు చెప్పే మాటలకు.. చేసే చేతలకు పొంతనలేదని, అడ్డగోలుగా నిధుల కోతల వల్ల రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కుంటుపడుతోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ అసమర్థత
2019-20లో ఏకంగా 18.9 శాతం నిధులు తగ్గడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమైతే.. ఇవాళ్టి(2020-21) బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ అంతకంటే ఎక్కువ అన్యాయాలు జరిగాయని, రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించడం దారుణమని సీఎం కేసీఆర్ అన్నారు. జీఎస్టీ విషయంలోనూ కేంద్రం మోసం చేస్తున్నదని, రాష్ట్రానికి రావవాల్సిన జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137కోట్లు ఇవ్వాల్సి ఉందని అధికారులకు గుర్తుచేశారు.
కేంద్రం పట్టించుకోలేదు
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తిచేసిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24వేల కోట్ల సాయం చేయాలని ఏకంగా నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం తనవంతు సాయం చేయలేదని సీఎం తెలిపారు. ఆర్థిక సహకారంపై చాలా సార్లు కోరినా కేంద్రం కనికరించకపోగా, కేటాయింపులు తగ్గించిందని మండిపడ్డారు.