బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపుకు కేసీఆర్ ఆర్థిక సాయం... బండి సంజయ్ సంచలన ఆరోపణలు
దుబ్బాక గెలుపుతో హైపర్ జోష్లో ఉన్న బీజేపీ... అదే ఊపులో గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఏ క్షణమైనా గ్రేటర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో... ఇప్పటినుంచే గ్రౌండ్ సిద్దం చేసుకుంటోంది. ఇదే క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్... నిత్యం దూకుడైన వ్యాఖ్యలతో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు దేశ ద్రోహులకు.. దేశ భక్తులకు మధ్య యుద్దమంటూ ఇప్పటికే మాటల దాడిని పెంచిన సంజయ్... హిందుత్వ ఓట్లను ఏకం చేసే దిశగా కదులుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
హిందువుల ఓట్లను తగ్గించారని ఆరోపణలు...
దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పినా టీఆర్ఎస్కు బుద్దిరాలేదని బండి సంజయ్ విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎంఐఎంకు కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. గ్రేటర్ పరిధిలోని 63 డివిజన్లలో హిందువుల ఓట్లను తగ్గించి మైనారిటీ ఓట్లను పెంచారన్నారు. దీనిపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. అభ్యంతరాలను పరిశీలించి.. వాటిని పరిష్కరించాల్సిన ఈసీ టీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు.
ఎంఐఎంకు కేసీఆర్ ఆర్థిక సాయం...
టీఆర్ఎస్,ఎంఐఎంలకు అనుగుణంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు చెబితేనే ఎన్నికల కమిషన్ వింటోందన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంకు మేయర్ పదవి దక్కుండా చూస్తామని... బీహార్లో ఎంఐఎం 5 ఆసెంబ్లీ స్థానాలు గెలుచుకునేందుకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు.దేశవ్యాప్తంగా ఎంఐఎం విస్తరించేందుకు కేసీఆర్ సహకరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
Recommended Video
భాగ్యనగరాన్ని కాపాడుకుంటాం.. : బండి సంజయ్
హిందువుల పండగల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. దీపావళికి టపాసులు కాల్చకుండా నిషేధించడం హిందువుల పండగలను చులకన చేయడమేనన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ల నుంచి భాగ్యనగరాన్ని కాపాడుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం మైలార్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ టీఆర్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఛత్రపతి శివాజీ,భజరంగ్ దళ్ , తాంతియా తోపే, వీర సావర్కర్, సర్దార్ పటేల్ వారసులుగా బీజేపీ కార్యకర్తలు కాషాయ జెండాను చేతబట్టుకుంటే.. మరోవైపు బిన్లాడెన్, ఔరంగజేబు, బాబర్, అక్బర్ వారసులుగా పచ్చ, గులాబీ జెండాలు పట్టుకుని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నాయకులు బయలుదేరారని ధ్వజమెత్తారు.