ఆ దరిద్రులపై కేసులు, అరెస్టులు తప్పవు: మోడీని విమర్శించేవారిపై కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: జనతా కర్ప్యూకు పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్ మీడియాలో కొందరు విమర్శులు చేస్తుండటంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశ ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. కరోనా నియంత్రణ, జనతా కర్ఫ్యూపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
జనతా కర్ఫ్యూ తెలంగాణలో 24 గంటలు: బస్సులు, మెట్రో, ఎంఎంటీస్ సేవల రద్దు, కీలక సూచనలు
మన ప్రధానిని మనమే కించపరుస్తామా?
మన దేశ ఐక్యత చాటుతూ.. చప్పట్లు కొట్టాలని ప్రధాని నరేంద్రే మోడీ పిలుపునిస్తే కొంతమంది వెధవలు అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టుుపెడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. ప్రాణాలకు తెగించిన కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులు, సిబ్బందికి సంఘీభావం తెలిపే పనిచేయాలని ఆయన కోరితే ఇలాగే చేస్తారా? మన ప్రధానిని మనమే కించపరుకుంటామా? అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
దేనికైనా ఓ లిమిట్ ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ దరిద్రులపై కఠిన చర్యలు తప్పవు..
ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టే దరిద్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని కేసీఆర్ అన్నారు. అంతేగాక, అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అందుకే జనతా కర్ఫ్యూ..
ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలందరూ తమ ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లు కొట్టాలంటూ ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపేందుకు, అభినందించేందుకే ఈ పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాగే గంట మోగిస్తూ చేశామని గుర్తు చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాను కూడా చప్పట్లు కొడతానని అన్నారు. కరోనాను కట్టడి చేసే ఉద్దేశం కూడా ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపులో ఉందని చెప్పారు. అందుకే తాను 24 గంటల జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
రిటైర్డ్ వైద్యులు, సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో..
కరోనా ప్రభావం కారణంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో రిటైర్ అయిన వైద్యులు, వైద్య సిబ్బందిని మూడు నెలల కోసం కాంట్రాక్ట్ తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. కరోనా తెలంగాణలో కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు, వారి అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు నిర్ణయంతో రిటైర్డ్ వైద్యులు, సిబ్బంది తిరిగి విధుల్లో చేరి కరోనా బాధితులకు చికిత్స అందించనున్నారు.