బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ వార్నింగ్ .. హాలియా సభలో ఆగ్రహం .. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిక
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బుధవారం రోజు హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను తొక్కేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి పార్టీ నేతలపై నిప్పులు చెరిగిన కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ భయంతోనే మరో పదేళ్ళు తానే సీఎం అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు: మతలబు చెప్పిన విజయశాంతి
బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు
బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. వాళ్ళలా మాట్లాడడం తమకు చేతకాక కాదని , తాము తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీలు మిగలవని మండిపడ్డారు. హద్దు మీరి మాట్లాడితే ఏం చేయాలో తమకు తెలుసన్న కేసీఆర్, తమకు అధికారం ఇచ్చింది ప్రజా తీర్పు అని చెప్పారు. ఢిల్లీ వాళ్ళు చెప్తే తమకు అధికారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం కాంగ్రెస్ కాదా?
తెలంగాణ రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పాడని, ఆనాడు ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఎందుకు మాట్లాడలేదు అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈరోజు కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నామని మాట్లాడుతున్నారని పేర్కొన్న కేసీఆర్, మీరు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కమీషన్ల కోసమే కట్టారా అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ నాయకులు రైతు బంధు, రైతు బీమా పథకాలు వస్తున్నందుకు రైతుల కోసం పోరుబాట పట్టారా?
నల్గొండ ఫ్లోరైడ్ సమస్యపై ఒకరైనా మాట్లాడారా అని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.రైతు బంధు, రైతు బీమా పథకాలు వస్తున్నందుకు రైతుల కోసం పోరుబాట పట్టారా అంటూ కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు విత్తనాలు ,ఎరువులు కనీసం ఇవ్వలేదని, ఈరోజు రైతులకు అండగా టిఆర్ఎస్ పార్టీ నిలబడిందని కేసీఆర్ స్పష్టం చేశారు. విజయ డైరీ మూసేస్తే కాంగ్రెస్ నేతలు నోరెందుకు తెరవ లేదు అని ప్రశ్నించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
సహనానికి కూడా హద్దు ఉంటుంది .. తొక్కిపడేస్తాం
బీజేపీ పై భగ్గుమన్న కేసీఆర్ బీజేపీ నాయకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు . వాళ్ల లాంటి కుక్కలు చాలా ఉన్నాయని వాటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పిచ్చి పనులు చేస్తే తొక్కి పడేస్తామని పేర్కొన్న ఆయన సహనానికి కూడా హద్దు ఉంటుందని హెచ్చరించారు . తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయి పోతారని వార్నింగ్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశామని , ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకొని కూర్చోలేదని స్పష్టం చేశారు. బిజెపి నాయకులకు పిచ్చివాగుడు మానుకోవాలని హితవు పలికారు కేసీఆర్. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు