కేంద్రం వివక్ష చూపినా దేశానికే దిక్సూచిగా తెలంగాణా; వరంగల్లో వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు.ఉదయం 11 గంటలకు ములుగు రోడ్డులో దామెర వద్ద ఉన్న ప్రతిమ హాస్పిటల్ కు చేరుకున్న ఆయన ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కళాశాలను ప్రారంభించారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మాలీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.
ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తిట్టిపోసిన కేంద్ర మంత్రులు మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కేసీఆర్ అన్నారు. అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
దేశంలో విద్వేషాలకు కుట్ర.. సమర్ధనీయం కాదు
భారతదేశం దేశం చాలా గొప్ప దేశం. సహనశీలత దేశం. అవసరమైన సందర్భాల్లో త్యాగాలకు సిద్ధపడే దేశం. పోరాటాలతో ముందుకు పోయే దేశం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందర్నీ కలుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం అన్నారు కేసీఆర్. పూలబోకే లాంటి గొప్ప దేశం. ప్రేమతో బ్రతికే ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
భవిష్యత్ మీది.. భారతదేశం మీదన్న కేసీఆర్
నా వయసు అయిపోతుంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భవిష్యత్ మీది.. ఈ భారతదేశం మీది. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం మీ మీద ఉంటుందని కేసీఆర్ తెలిపారు. మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్యను కూడా పెంపొందించుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.
తెలంగాణా అన్ని రంగాల్లో ముందంజలో ఉంది
ఇక్కడున్న విద్యార్థులకు అన్ని విషయాలు తెలుసు.. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉంది. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
కేంద్రం వివక్ష చూపినా వైద్య రంగంలో మిషన్ తో ముందుకు వెళ్తున్నాం
కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపినప్పటికీ తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని, ఆ దిశగా రూరల్ హెల్త్ మిషన్ తో ముందుకు వెళ్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో ఉన్న కాలేజీలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కళాశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెడికల్ కళాశాలతో పాటు, ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కెసిఆర్ వెల్లడించారు.
33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు కృషి
కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. కేంద్రం సహకరించకున్నా.. 33 జిల్లాల్లో 33 కాలేజీలు ప్రారంభించుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 6500 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయన్న సీఎం కేసీఆర్ హరీశ్రావు సారథ్యంలో ఇది సాధ్యమైందన్నారు. 2014కు ముందు 2800 మెడికల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు 6500 మెడికల్ సీట్లు ఉన్నాయి.
అన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే దాదాపు 10 వేలు కూడా దాటే అవకాశం ఉంది. మన విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్కు వెళ్లే అవకాశం కూడా రాదు. పీజీ సీట్లు 1150 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 2500కు చేరింది. ఆరోగ్య రంగంలో చాలా బాగా పురోగమిస్తున్నామన్నారు . తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక మార్గదర్శకంగా మారిందన్నారు కేసీఆర్. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయన్నారు.