వంద కోట్ల స్కామ్.. కేసీఆర్ కన్నెర్ర.. నిగ్గు తేల్చనున్న సీఐడీ
విచారణలో బయటపడే సంచలనాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే మరిన్ని స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల్లో అవినీతిపై సీఎం కేసీఆర్ కన్నెర్ర చేస్తున్నారు. బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన అవినీతిపై సీఎం తీవ్ర అసహనంతో ఉన్నారు. అధికారులు చెప్పిన లెక్కలకు.. అందిన నివేదికలకు ఎక్కడా పొంతన లేకపోవడంతో సీఎం వారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
అధికారులు చెబుతున్న లెక్క రూ.60కోట్లు కాగా, సీఎం తెప్పించుకున్న నివేదికల్లో దాదాపు రూ.100కోట్ల మేర అవినీతి జరిగినట్లు తేలింది. దీంతో ఇక నుంచి ప్రతీ సర్కిల్ కార్యాలయ పరిధిలోని ఆడిటింగ్ ను తప్పనిసరిగా కేంద్ర కార్యాలయాల్లో పర్యవేక్షించాలని, అధికారులపై ఎన్ ఫోర్స్ మెంట్ నిఘాను పెంచాలని ఆదేశించారు.
అవసరమైతే మరిన్ని స్పెషల్ టీమ్స్ దించండి:
ప్రస్తుతం ఈ కేసును సీఐడీ విచారణ జరుపుతుండగా.. దర్యాప్తు తీరుపై డీజీపీ అనురాగ్ శర్మ నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో బయటపడే సంచలనాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే మరిన్ని స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో:
బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి అంశంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. అక్రమాల్లో పాలు పంచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని భావిస్తోంది. ఇందుకోసం కమర్షియల్ ట్యాక్స్ సీటీవోలు, ఏసీటీవోలు, సూపరింటెండెంట్లు, డీసీటీవోలు, జాయింట్ కమిషనర్ల విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
18మందిని విచారించనున్న సీఐడీ:
కుంభకోణానికి సంబంధించి మొత్తం 18మంది అధికారుల పాత్రపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. ఒకవేళ ఆరోపణలు నిజమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఐడీ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశించనున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి:
వాటాలు వేసుకుని మరీ బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీ కొట్టారు. గతంలో బోధన్ లో పనిచేసి ఏసీటీవో, సీటీవోల దగ్గరి నుంచి డివిజన్ కార్యాలయాలు, జాయింట్ కమిషనర్ల వరకు ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉన్నారని సీఐడీ వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు ఆడిటర్ గా ఉంటు ట్యాక్స్ చెక్కులు వసూలుు చేసిన శివరాజుతో కలిసి ఈ 18మంది అధికారులు వాటాలు పంచుకుని అవినీతి పాల్పడినట్లు విచారణలో తేలింది. జాబితాలో ఉన్న 18మంది అధికారులు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోను శివరాజుతో కలిసి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే ఆ ప్రాంతాల వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. కాగా, బోధన్ లో రూ.25లక్షలకు పైగా ట్యాక్స్ చెల్లించాల్సిన 100మంది వ్యాపారులు వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ భావిస్తోంది. దీంతో ట్యాక్స్ ఎగవేసి నకిలీ చలాన్లు తెచ్చుకున్న వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూడాలి మరి కేసు విచారణలో ఇంకెన్ని నిజాలు నిగ్గు తేలుతాయో!