మంత్రి జగదీశ్పై కేసీఆర్ ఎందుకు కోపడ్డారు, 'పెద్దలు జానారెడ్డి' అనగానే సభలో నవ్వులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై వాడివేడిగా రెండు రోజులు పాటు చర్చ సాగింది. బుధవారం నాటి సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ తన సొంత కేబినెట్ సహచరుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం అసెంబ్లీలో వికారుద్దీన్ ఎన్కౌంటర్పై మాట్లాడేందుకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ యత్నించగా స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. అదే సమయంలో రైతు ఆత్మహత్యలు, సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తన ప్రకటనను చదవడం ప్రారంభించారు.
దీంతో కల్పించుకున్న స్పీకర్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కూర్పోమని సూచించారు. అయితే స్పీకర్ సూచనను గమనించని పోచారం తన ప్రకటనను కొనసాగించారు. ఈ సమయంలో పోచారం పక్క సీట్లో కూర్చున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పోచారంను ఆపేందుకు యత్నించారు.
ఈ క్రమంలో ఆయన ‘‘ఓ అన్నా... కూకో అన్నా'' అంటూ గట్టిగా అరిచారు. ఈ మాటలను విన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్తంత చికాకుపడ్డారు. ‘‘నీకేం పని... నీ పని నీవు చూసుకో'' అంటూ జగదీశ్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డినుద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.
సభలో రైతు సమస్యలపై ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. విపక్షాల ప్రస్తావన తెచ్చారు. ఈ సందర్భంగా జానారెడ్డిని ఉద్దేశించి.. ‘పెద్దలు జానారెడ్డి' అని సంభోదించారు. దీంతో ఒక్కసారిగా అధికార, విపక్ష సభ్యులు ఘొల్లున నవ్వారు. దీంతో సీఎం కేసీఆర్ ‘‘ఎందుకు నవ్వుతున్నరయ్యా'' అని చిరుకోపం ప్రదర్శించారు.
రైతు ఆత్మహత్యలను నిరోధించడానికి విపక్షం నుంచి తగిన సూచనలు రాలేదన్నారు. దీంతో జానారెడ్డి మధ్యలో జోక్యం చేసుకొని.. ‘‘మా దగ్గర సూచనలు ఉన్నాయి. వాటిని రాసుకొని ఉన్నాం. ఇప్పుడు అవకాశం ఇస్తే, చెప్పటానికి సిద్ధం. సూచనలు చేయలేదని అనొద్దు'' అని అన్నారు.
దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘మేం ఎలాంటి భేషజాలకు పోయేదిలేదు. జానారెడ్డి చేసే సూచనలు మాకు శిరోధార్యం'' అని చెప్పారు. మరో సందర్భంలోనూ.. ‘‘జానారెడ్డి నిర్వహించని పదవులు లేవు. ఒకే సారి ఏడు మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఆయనకు అపార అనుభవం ఉంద''న్నారు. ఈ సమయంలో జానారెడ్డి సైతం నవ్వుతూ కనిపించారు.