ఐదు ఎమ్మెల్సీ సీట్లపై గులాబీ బాస్ గురి ? సండ్ర, రేగా, సక్కు చేరికతో విజయంపై ధీమా
హైదరాబాద్ : మండలి సీట్లపై గులాబీ దళం ఫోకస్ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 5 సీట్లలో విజయం సాధించేందుకు వ్యుహరచన చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం నలుగురు బరిలో ఉండగా .. మిత్రపక్షం ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో ఉన్నారు.
కావాల్సింది 105.. ఉన్నది 101 ఓట్లే
సీఎం కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 105 సభ్యుల ఓట్లు కావాలి. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 91 సభ్యుల మద్దతు ఉంది. మజ్లిస్ పార్టీకి ఏడు మంది సభ్యులు ఉన్నారు. మొత్తం సభ్యుల సంఖ్య 98కి చేరింది. కొత్తగా చేరే సండ్ర వెంకట వీరరయ్య, రేగా కాంతారావు, ఆత్రం సక్కుతో ఆ సంఖ్య 101కి చేరింది. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 21 సభ్యుల ఓట్లు కావాలి. ఐదు సీట్లలో విజయానికి 105 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ కూటమి విజయానికి 4 సీట్ల దూరంలో ఉన్నది. మరో నలుగురు అభ్యర్థుల మద్దతు కూడగట్టే అంశంపై సీఎం కేసీఆర్ ఆదివారం తన నివాసంలో సమాలోచనలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారానే విజయం సాధించాలని గులాబీదళం వ్యుహరచన చేస్తోంది. ఇందుకోసం చేరికలను ప్రోత్సహించాలా ? లేదా మద్దతు మాత్రమే స్వీకరించాలా ? ఓటింగ్ కు హాజరుకాకుండా చూడాలా నే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తోంది.
టీడీఎల్పీ విలీనమేనా ?
సండ్ర, కాంతారావు, సక్కుతోపాటు మరికొందరు టీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే వారి చేరికను ఎప్పుడు ఎలా నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్టానం మదనపడుతోంది. ఎన్నిక కోసం నేరుగా పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణ ధోరణిలో పడుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో గతంలో మాదిరిగా టీడీపీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఇదివరకు మండలి సీఎల్పీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా చేస్తే తమకు ఇబ్బందులు ఎదురుకావని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.
మరికొందరు నేతలు ఉన్నారా ?
ఇప్పటికే ముగ్గురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించారు. మరికొందరు కూడా టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన తర్వాత .. నిన్న సీఎల్పీ నిర్వహించిన సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి హాజరుకాలేదు. ఒకరు ఢిల్లీలో ఉన్నారని, మరొకరు అనారోగ్య సమస్యతో భేటీకి రాలేదని సీఎల్పీ తెలిపింది. సమావేశానికి వీరు హాజరుకాకపోవడానికి కారణాలు అవేనా ? లేదా పార్టీ మారే అవకాశం ఉన్నదా అనే చర్చ కూడా జరుగుతోంది.
మండలి విజయంతో పార్లమెంట్ కు
మండలి ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉన్నది. 5 సీట్లలో విజయం సాధించి .. లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. మండలి విజయం తీసుకొచ్చిన జోష్ .. పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సునాయమవుతోందని అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ 16 సీట్లలో .. మిత్రపక్షం ఎంఐఎం 1 చోట పోటీ చేసి గెలువాలని భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేస్తోంది.