కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల ఫోకస్ పెట్టమన్న సీఎం కేసీఆర్ .. రంగంలోకి ఉన్నతాధికారులు
తెలంగాణా రాష్ట్రం కరోనాపై సమరం చేస్తుంది. అయినా ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇక ఇప్పటివరకు 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఆశించిన మేరకు రావటం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో పని తీరు ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగనున్నారు .
కరోనా కంట్రోల్ కోసం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో లేదో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని తెలంగాణా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. అధికారులను తాజా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.సూర్యాపేటలో కేసుల పెరుగుదల పై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం సూర్యాపేటకి ప్రత్యేక అధికారిని నియమించారు. పురపాలక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డిని అక్కడ స్పెషల్ అధికారిగా పంపించారు .
ఇక ఉన్నతాధికారులను నేరుగా రంగంలోకి దిగాలని ఆదేశించారు .హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. అసలు కేసులు పెరగటానికి , కరోనా కంట్రోల్ లోకి రాకపోవటానికి కారణాలు అన్వేషించాలని , కట్టడి చేసే మార్గాలు వెతకాలని సీఎం పేర్కొన్నారు. ఇక సిఎం ఆదేశం మేరకు సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రంగంలోకి దిగుతున్నారు. రేపు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇక కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలపై సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తాజా పరిణామాల నేపధ్యంలో తెలుస్తుంది .