సీఎం జగన్ ను ఫాలో అయిన సీఎం కేసీఆర్: పెంచేశారుగా లిక్కర్ ధరలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఫాలో అవుతున్నారా? విపరీతంగా మద్యం ధరలు పెంచి ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారా? నూతన సంవత్సరం దగ్గరపడుతున్న వేళ మందుబాబులు జేబులకు చిల్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారా ?అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.
ఆదాయం వచ్చే అంశాలపై మాత్రమే సీఎం కేసీఆర్ దృష్టి
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చే విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని బాగానే ఫాలో అవుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీ ప్రభుత్వం విలీనం చేసినా అది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి 50 రోజులకు పైగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేసినా సీఎం కేసీఆర్ ఇసుమంతైనా చలించలేదు. కానీ ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలని భావించిన ఏపీ సర్కార్ మద్యం ధరలు విపరీతంగా పెంచేసింది. దీంతో బాగానే ఆదాయం గడిస్తోంది.
మద్యం ధరలను విపరీతంగా పెంచేసిన తెలంగాణా సర్కార్
ఇక తెలంగాణ సర్కారు కూడా ఏపీ బాటలోనే మద్యం ధరలు విపరీతంగా పెంచేసి ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది.గత అక్టోబరు నుంచి తీసుకొచ్చిన సరికొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా అప్లికేషన్ల ఫీజు కిందనే ప్రభుత్వానికి రూ.935 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక తాజాగా మద్యం ధరల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ పెరిగిన ధరలను అమల్లోకి కూడా తీసుకొచ్చారు. పేదలు తాగే చీప్ లిక్కర్ నుంచి పెద్దలు తాగే ఖరీదైన మద్యం వరకూ కనీసం 10 శాతం నుంచి 30 శాతం వరకూ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.
పెంచిన ధరలతో పెరగనున్న నాలుగుకోట్ల మేర అదనపు ఆదాయం
తాజాగా పెంచిన ధరల కారణంగా ప్రభుత్వానికి ఏడాదిలో రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని రకాల బ్రాండ్లలో క్వార్టర్ బాటిల్ పై దాదాపు రూ.20 వరకు ధర పెరగనుంది.తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు ఏకంగా రూ.20వేల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.
10 శాతం నుండి 30 శాతం వరకు పెంచేసిన లిక్కర్ ధరలు
పెంచిన మద్యం ధరలలో చీఫ్ లిక్కర్ ధర మీద కూడా ఏకంగా 30 శాతం పెంచేశారు. ఇక కొత్త సంవత్సరం దగ్గరకు వస్తున్న వేళ పెంచిన ధరలను అమల్లోకి కూడా తీసుకు వచ్చింది తెలంగాణ సర్కార్. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి అని, ధరలు పెంచితే ఖజానాకు అదనపు ఆదాయం వస్తుందని భావించిన తెలంగాణ సర్కార్ మందుబాబులకు న్యూ ఇయర్ కి ముందు షాక్ ఇచ్చింది. పెరిగిన ధరలు మందుబాబులకు కాస్త ఇబ్బంది కలిగించినా, పెరిగిన ధరలను చూసి మందు మానేస్తారా ?