మహాగణపతి సేవలో కేసీఆర్ మనవడు: ఏం మాట్లాడాడో చూడండి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనయుడు హిమన్షు దర్శించుకుని సందడి చేశాడు. మహాగణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశాడు. హిమాన్షు ఎవరో తెలియని భక్తులు, ఓ బాలుడికి ఇంత సెక్యూరిటీ ఏంటా అని ఆరాతీశారు.
సీఎం మనుమడు వచ్చినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు మైకులో ప్రకటించడంతో వేలమంది భక్తులు చేతులు ఊపుతూ హిమాన్షుకు అభినందనలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులతో ఖైరతాబాద్ గణేశుడి విశిష్ఠతను తెలుసుకొని సరదాగా వారితో ముచ్చటించారు. గణేశుడి మండపం వద్ద ఉన్న హారతి పల్లాన్ని హిమాన్షు చేతిలోకి తీసుకొని స్వామి వారికి కర్పూర హారతి సమర్పించారు.
మహాగణపతి వద్ద పూజ అనంతరం హిమాన్షు మీడియా మాట్లాడాడు. "నిమజ్జనం వేడుకల్లో నేను తొలిసారిగా పాల్గొంటున్నా. ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిఒక్కరూ ఆనందంగా ఉండాలని గణపతిని వేడుకున్నా" అని చెప్పాడు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం మహాగణపతిని పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే సాయన్నలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.