సీయం కేసీఆర్ - ఆయనకు ఆయనే సాటి..! ఆయనకు ఆయనే పోటీ..!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.. ఉద్యమంలో గానీ, రాజకీయాల్లో గానీ, శాసన సభలో గానీ ఆయనకు ఆయనే సాటి..! ఆయనకు ఆయనే పోటీ..! ముఖ్యమంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన అరుదైన ఘనత దక్కించుకున్నారు. గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే అలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో పది మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పించారు చంద్రశేఖర్ రావు. ఇక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి మరో రికార్డు నెలకొల్పారు ముఖ్యమంత్రి.
బడ్జెట్ ప్రవేశపెట్టడంలో అరుదైన ఘనత..! కేసీఆర్ ఏది చేసినా సంచలనమే..!!
బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన మంత్రివర్గ విస్తరణ కావడంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఎవరో ఒకరికి ఆర్థిక శాఖ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కొప్పుల ఈశ్వర్ లేదా నిరంజన్కు ఆర్థిక శాఖ ఇస్తారని ప్రచారం జరిగినా.. కీలక శాఖలేవీ మంత్రులకు కేటాయించలేదు. ఆర్థికం, భారీ నీటి పారుదల, మున్సిపల్ వ్యవహారాలు, పౌరసరఫరాలు.. ఇలా కీలక శాఖలన్నీ తన వద్దనే ఉంచుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక లెక్క..! ఇప్పుడొక లెక్క..!!
కేసీఆరే శుక్రవారం రోజున శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రిగా ఉండి ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డులెక్కారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్థిక శాఖ ఈటల రాజేందర్కు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో అయిదుసార్లు ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి మాత్రం ఆర్థిక శాఖను చంద్రశేఖర్ రావే పర్యవేక్షిస్తుండడం విశేషం..!
తెలంగాణలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్..!
రెండోసారి ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో తొలి బడ్జెట్ను కేసీఆరే ప్రవేశపెట్టారు. గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టని ముఖ్యమంత్రలు ఉన్నారు. 2010-11 బడ్జెట్ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోశయ్యనే ప్రవేశపెట్టారు. అంతకుముందు 1964లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
సంక్షేమానికి పెద్ద పీఠ..! తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్..!!
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి మొత్తం ప్రతిపాదిత వ్యయం 1,82,017 కోట్ల రూపాయలు కాగా, రెవెన్యూ వ్యయం 1,31,629 కోట్లు. మూల ధన వ్యయం 32,815 కోట్లు. 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో రెవెన్యూ మిగులు 6,564 కోట్ల రూపాయలు. ఆర్థిక లోటు 27,749కోట్ల రూపాయలు. కౌన్సిల్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.