ప్రాజెక్టుల రీడిజైనింగ్: సీఎం ఫడ్నవీస్కు కేసీఆర్ ఫోన్, త్వరలోనే మహారాష్ట్రకు (ఫోటోలు)
హైదరాబాద్: గోదావరి జలాలను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ కొలిక్కి రావటంతో యుద్ధప్రాతిపదికన కార్యాచరణ మొదలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం క్యాంపు కార్యాలయంలో గోదావరి బ్యారేజీలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కేసీఆర్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. తుమ్మిడిహట్టి, కాళేశ్వరం వద్ద నిర్మించనున్న బ్యారేజీలు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి ఆయనకు వివరించారు. గతంలో మాదిరిగా తుమ్మిడిహట్టివద్ద బ్యారేజీ నిర్మించడం వల్ల మహారాష్ట్రలో ముంపు ఉండదని సీఎం స్పష్టంచేశారు.
దాంతో పాటు గడ్చిరౌలి జిల్లా సరిహద్దులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, దీనివల్ల కూడా మహారాష్ట్రలో ముంపు ఉండబోదని ఫడ్నవిస్కు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని బృందం త్వరలోనే మహారాష్ట్రలో పర్యటించి, అక్కడి మంత్రి, అధికారులతో సమావేశమవుతుందని ఈ సందర్భంగా సీఎం వివరించారు.
ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తామని, ఆ తర్వాత సీఎంల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. దీనికి ఫడ్నవిస్ సానుకూలంగా స్పందించారు. గోదావరి నదిలో 160టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు గతంలో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లినపుడే అంగీకరించిన ఫడ్నవిస్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బృందాన్ని తమ వద్దకు పంపాలని, తాము కూడా తమ నీటిపారుదల శాఖ మంత్రి, అధికారులను సిద్ధం చేస్తామని కేసీఆర్ను సీఎం ఫడ్నవీస్ కోరారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సంభాషణ తర్వాత ప్రాజెక్టుల పూర్తిస్థాయి నివేదికలను తీసుకొని హరీశ్రావు నేతృత్వంలోని బృందం సమగ్ర నివేదికలతో త్వరలోనే మహారాష్ట్ర వెళ్లాలని నిర్ణయించారు.
అనంతరం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుతో కూడా సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాలువలు, పైపులైన్లకు సంబంధించిన నివేదికలు పూర్తికావాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా కనిష్ఠ ముంపు, గరిష్ఠ నీటి వినియోగం అనే పద్ధతిలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని చెప్పారు.
దీనివల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండబోవన్నారు. తుమ్మిడిహట్టివద్ద 148మీటర్ల ఎత్తులోనే బ్యారేజీ నిర్మించాలని, ఆదిలాబాద్ జిల్లాకు నీరు పారించటానికి అనువుగా రెండు, మూడు రిజర్వాయర్లకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
కాళేశ్వరం బ్యారేజీని కూడా వీలైనంత తక్కువ ముంపు ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన తుది ముసాయిదాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ నెలాఖరువరకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసి, కార్యాచరణ రూపొందించాలని, జనవరిలో పనులు మొదలుపెట్టాలని సీఎం స్పష్టంచేశారు.
వచ్చే ఏడాది వర్షాలు కురిసేలోపు చాలా పని జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈలు హరిరాం, వెంకటేశ్వర్లు, వ్యాప్కోస్ ఎండీ శుంభు ఆజాద్, ఇతర అధికారులు ఉన్నారు.