ముందే దీపావళి: పంచాయతీ కార్మికుల జీతాలు పెంచిన సీఎం కేసీఆర్, ఎంతంటే?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తీపికబురు అందించింది. కార్మికుల వేతనాలను నెలకు రూ. 8,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు ఒక్కో గ్రామంలో ఒక్కోలా వేతనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అన్ని పంచాయతీల్లో ఒకే రకమైన వేతనాలు ఉండేలా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
పెంచిన జీతాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం జీతాలు పెంచడంతో కార్మికుల కుటుంబాల్లో దీపావళి పండగ ముందే వచ్చినట్లయింది. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కార్మికులు సమ్మెకు దిగడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. సమ్మెలో దిగిన కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
అయితే, న్యాయమైన తమ డిమాండ్లను తీర్చమంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అంటూ ఆర్టీసీ సంఘాలు మండిపడుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ సమ్మె విరమించేది లేదని స్ఫష్టం చేస్తున్నాయి. అయితే, తాజాగా టీఆర్ఎస్ నేత కే కేశవరావు ఆర్టీసీ సంఘాలు చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని ఆర్టీసీ సంఘాలు సుముఖత వ్యక్తం చేశాయి. తమ విషయంలో కూడా సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆర్టీసీ కార్మికులు ఆకాంక్షిస్తున్నారు.