సిద్దిపేటలో కలెక్టరేట్,పోలీస్ కమిషరేట్ కార్యాలయాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో నిర్మించిన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆదివారం(జూన్ 20) ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ కలియతిరిగారు. మంత్రి హరీశ్ రావు కలెక్టరేట్ భవనంలోని గదులను సీఎంకు చూపిస్తూ నిర్మాణ విషయాలను వివరించారు. రూ.63 కోట్ల 60 లక్షలతో వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు వినతి పత్రాలతో రాగా సీఎం కేసీఆరే స్వయంగా వాటిని తీసుకున్నారు.
అంతకుముందు,సిద్దిపేటలోనే పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. రూ.4 కోట్ల వ్యయంతో నాలుగెకరాల విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయం నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్మెల్యే కార్యాలయం,మొదటి అంతస్తులో నివాసం ఏర్పాటు చేశారు. అభివృద్ది పనుల ప్రారంభోత్సవం అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.
అనంతరం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Recommended Video
సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం(జూన్ 22) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాళోజీ యూనివర్సిటీ, వరంగల్ అర్బన్ కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్న సీఎం... అక్కడి గ్రామ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై వారితో చర్చించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లో కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది.