ఆ మూడు కులాలతో కేసీఆర్ కు ముప్పే..! హుజూర్నగర్లో గులాబీ పరిస్థితి?
హైదరాబాద్ : తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. ఎలాగయినా గెలిచి తీరాలని అన్ని రాజకీయ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. అధికార గులాబీ పార్టీ ఓ అడుగు ముందుకేసి సామాజిక వర్గాల వారీగా నాయకులను రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం చంద్రశేఖర్ రావు అన్ని రకాల అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అదికార పార్టీకి తలనొప్పిగా పరిణమించిన ఆ మూడు సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునేందుకు చంద్రశేఖర్ రావు వినూత్న వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
జూపల్లి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకమేనా ? ఆ జిల్లాలో మాజీ మంత్రిని తొక్కేస్తున్న సొంతపార్టీ నేతలు
కేసీఆర్ ను కలవరపెడుతున్న ఆ మూడు సామాజిక వర్గాలు.!హుజూర్నగర్ లో సహకాం ఉంటుందా.?
అధికార గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో పాటు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న కులాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు సైతం అదే కులానికి చెందిన ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కులానికి చెందిన ఓటర్లను టీఆర్ఎస్ వైపు మళ్ళించేలా చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ రావు ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేసారు. చంద్రశేఖర్ రావు టార్గెట్ ఎలా ఉన్నా హుజూర్ నగర్ నియోజక వర్గంలో మూడు ప్రధాన సామాజిక వర్గాల టెన్షన్ మాత్రం గులాబీ పార్టీకి గుబులు రేపుతున్నట్టు చర్చ జరుగుతోంది.
అలెర్టైన గులాబీ బాస్..! రంగంలోకి అదే సామాజిక వర్గాల ప్రజాప్రతినిధులు..!
ఈ మూడు సామాజిక వర్గాలు తమ పార్టీకి ఎంత వరకు అండగా నిలుస్తాయవన్న సందేహాలను అదికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే సీఎం చంద్రశేఖర్ రావు ఈ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తొలిసారి సీఎం అయినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మిగిలిన అన్ని సామాజిక వర్గాల కంటే పెద్ద పీఠ వేస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రశేఖర్ రావు మంత్రి వర్గంలో ఆరుగురు రెడ్డి మంత్రులు ఉండటం కూడా ఉన్నారు. అయినప్పటికి సీఎం చంద్రశేఖర్ రావు రెడ్డి సామాజిక వర్గానికి పైపై మెరుగులతో సంతృప్తి పరుస్తున్నా, అంతర్గతంగా తొక్కి పెడుతున్నారన్న అభిప్రాయం ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలతో పాటు, యువత, మధ్యతరగతి ప్రజల్లో ఉంది. దీంతో వారంతా సీఎం చంద్రశేఖర్ రావు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ లో ఏదన్నా తేడా వస్తే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
వెనుకబడిన వర్గాల నుండి ప్రతిఘటన తప్పదా..? గులాబీ బాస్ పాచిక పారుతుందా..?
ఇక హుజూర్నగర్ లో టిఆర్ఎస్ పార్టీకి మాదిగ సామాజిక వర్గం నుంచి గట్టి ఎదురుదెబ్బ తప్పదనే చర్చ బలంగా వినిపిస్తోంది. మాదిగలకు సీఎం చంద్రశేఖర్ రావు తీరని అన్యాయం చేస్తున్నారని ఆ సామాజికవర్గం నేతలు మండిపడుతున్నారు. రెండోసారి చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మాదిగలకు చోటు ఇవ్వలేదు. తాజాగా జరిగిన విస్తరణలోనూ ఆ సామాజికవర్గాన్ని అస్సలు పట్టించుకోలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి టీ.రాజయ్యను సైతం చంద్రశేఖర్ రావు గత ప్రభుత్వంనుండి ఉద్వాసన పలకడం పైనా ఆ సామాజికవర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణలో ఉన్న మాదిగ దాని ఉప కులాలను చంద్రశేఖర్ రావు పట్టించుకోకపోవడంతో హుజూర్నగర్ లో ఆ సామాజిక వర్గ ప్రభావం టీఆర్ఎస్ అభ్యర్థిపై పడే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
కీలకం కానున్న కమ్మ ఓటర్లు..! హుజూర్ నగర్ లో ఎవరికి మద్దత్తు...?
ఇక తెలుగుదేశం పార్టీని ముందు నుంచి విపరీతంగా అభిమానించే కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా తన వైపునకు తిప్పుకునేందుకు సీఎం చంద్రశేఖర్ రావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హుజూర్నగర్లో ఈ సామాజికవర్గ ఓటర్లు పాతిక వేల వరకు ఉన్నారు. టిడిపి ఇప్పుడు ఇదే వర్గానికి చెందిన కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు సీఎం చంద్రశేఖర్ రావు ఈ వర్గానికి చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికె పూడి గాందీ, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. వీరు హుజూర్ నగర్ లో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంతవకు ప్రభావితం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఈ మూడు సామాజికవర్గాల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అనే దిగులు గులాబీ బాస్ ను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది.