బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్ .. గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది. 10 మందితో తన టీంను ఏర్పాటు చేశారు కేసీఆర్. అయితే వారిలో ఎవరికీ ఆర్థికశాఖ ఇవ్వకపోవడం ... ఫైనాన్స్ తో పాటు కీలకశాఖలను తన వద్దే అట్టిపెట్టుకోవడంతో ఈసారి ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు.
కేసీఆర్ పద్దు
2018-2019 సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపులు .. అంచనా వ్యయం, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ స్వయంగా ఆర్థిక నిపుణులతో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించాక అసెంబ్లీలో సీఎంగా తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేసీఆర్. తొలి విడుతలో ఆర్థికమంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఐదు పర్యాయాలు పద్దును ప్రవేశపెట్టారు. ఈ సారి ఆయనకు కేబినెట్ లో అవకాశం లభించినా .. ఆర్థికశాఖ కాకుండా సంక్షేమ పోర్టుపోలియో కేటాయించడంతో లెక్కా పద్దులను సమర్పించేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారని అర్థమవుతోంది.
సంక్షేమమే ప్రయారిటీ ..
తాత్కాలికంగా 4 నెలల కాలానికి ప్రవేశపెట్టే ఈ పద్దులో కూడా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసే అవశాశం ఉంది. ఎప్పటిలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా పథకాలకు కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే గతంలో కంటే కేటాయింపులు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు విశ్వససీయ వర్గాల ద్వారా తెలిసింది.
గతంలో నేదురుమల్లి ..
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టిస్తున్నారు. 1990-1992 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనార్థన్ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో ఇతర కారణాల వల్ల ఆర్థికశాఖను పర్యవేక్షించారు. మార్చి నెలలో పద్దును ప్రవేశపెట్టారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణలో ఓ సీఎం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.