కొత్త రెవెన్యూ చట్టంలో సంచలనాలు-తహసీల్దార్లే రిజిస్ట్రార్లు-సమస్తం ‘ధరణి’లోనే :అసెంబ్లీలో కేసీఆర్
1.12 లక్షల చదరపు కిలోమీటర్లు.. అంటే.. 2.75 కోట్ల ఎకరాల విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఇకపై భూములకు సంబంధించిన సమస్త సమాచారం 'ధరణి' వెబ్ సైట్ లో నిక్షిప్తం కానుంది. ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్సైట్ను ఓపెన్ చేసి చూసుకునే వీలుంటుంది. అంతేకాదు, ఇక నుంచి తహసీల్దార్లు అందరూ జాయింట్ రిజిస్ర్టార్లుగా వ్యవహరిస్తారు. రెవెన్యూ కోర్టులకూ మంగళంపాడేశారు.. ఇలా అన్నిటికి అన్నీ సంచలన అంశాలతో కూడిన తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం ప్రతిపాదిత బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తూ, కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలపై సీఎం బ్రీఫింగ్ ఇచ్చారు.
జగన్ గారూ.. ఆ వెధవ మాటలు విని అనర్హత వేటేస్తారా? పిటిషన్ వాపస్ తీసుకోండి: ఎంపీ రఘురామ సంచలనం
ప్రతి ఇంచూ ధరణిలో నిక్షిప్తం..
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని, ప్రతి సర్వే నెంబర్కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేస్తామని, అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతల్ని ఖరారు చేస్తామని, తర్వాతి రోజుల్లో భూతగాదాలు లేకుండా అన్ని రెవెన్యూ కోర్టులనూ రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూములకు సంబంధించిన వివరాలన్నీ ధరణి పోర్టల్లో పూర్తి పారదర్శకంగా ఉంటాయని, ఇందులో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లాండ్ అనే రెండు విభాగాల్లో వాటిని పొందుపరుస్తామని, ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్సైట్ను ఓపెన్ చేసి చూసుకునే వీలుంటుందని కేసీఆర్ చెప్పారు.
జాయింట్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లు
ప్రతిపాదిత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ అయినవెంటనే మ్యూటేషన్ ప్రక్రియ ఉంటుందని, ఇప్పటిదాకా ఆర్డీవో చేతిలో ఉన్న మ్యూటేషన్ అధికారాలను తహసీల్దార్లకు అప్పగిస్తామని సీఎం పేర్కొన్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి.. తహసీల్దార్లే జాయింట్ రిజిస్ర్టార్లుగా వ్యవహరిస్తారని, అయితే తహసీల్దార్లు వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారని, వ్యవసాయేతర భూములు మాత్రం రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరుగుతాయని గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
అవినీతిపై కొరడా..
మహమ్మారిలా పేరుకుపోయిన అవినీతిని అంతం చేసేందుకే తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. పాస్ పుస్తకాలు లేని భూములకు వెంటనే జారీ చేసే అధికారం తహసీల్దార్లదేనని, వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తైన వెంటనే రికార్డు పూర్తిచేసి కొన్నవారికి బదిలీ చేయాలన్న నిబంధన కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపర్చారు. తప్పుచేసిన తహసీల్దార్పై బర్తరఫ్ వేటుతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకునే వీలు, తిరిగి భూముల్ని స్వాధీనం చేసుకునే క్లాజులను కూడా కొత్త చట్టంలో చేర్చామని, రికార్డుల్లో సవరణలు చేస్తే అధికారులపై దావా చేయకూడదనే అంశం కూడా ఇందులో ఉందని సీఎం పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చే సందర్భంలో పాస్ పుస్తకాలను పెట్టుకోరాని, ఇకపై డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు అందుతాయని చెప్పారు.
చంద్రబాబు, వైఎస్ హయాంలోనూ..
కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన సందర్బంగా సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. ‘‘తరతరాలుగా రైతులు, పేదలు అనుభవిస్తోన్న బాధలకు చరమగీతంపాడుతూ.. సరళీకృతమైన కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. రాష్ర్టంలోని ప్రతి కుటుంబానికి ఈ బిల్లు వర్తిస్తుంది. వేల ఏళ్లుగా మనిషి జీవితం భూమి చుట్టూ, వ్యవసాయం చుట్టూ తిరుగుతోంది. నేలను ఉత్పత్తి సాధనంగా గుర్తించడంతో దాని విలువ పెరిగింది. భూములకు సంబంధించి అనేకానేక సమస్యలున్నాయి. తెలంగాణలో భూ, రెవెన్యూ సంస్కరణలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ హయాంలో కొన్ని మార్పులు జరిగాయి. అయితే గత పాలకులు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ఆ లోటును పూడ్చుతూ రూపొందించిదే ఈ కొత్త రెవెన్యూ చట్టం'' అని కేసీఆర్ వివరించారు.
చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటన