సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్ .. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శించి ఆపై ...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యాపేటకు రానున్నట్లుగా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో నేడు సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దేశం కోసం కల్నల్ సంతోష్ బాబు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమైనవని, యువతకు మార్గదర్శకమైనవని పేర్కొన్నారు. ఇక వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
సైనికుల కవాతు, అశ్రు నయనాల మధ్య కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర .. ఆద్యంతం ఉద్వేగం
సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణా మంత్రి
ఇక ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని పేర్కొన్నారని చెప్పారు. సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని, అలాగే సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని, అది కూడా ఆమెకు నచ్చిన శాఖలో ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో సోమవారం మధ్యాహ్నం వారి కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ వస్తారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం సంతోష్ బాబు కుటుంబాన్ని కలవనున్న సీఎం కేసీఆర్
కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతోష్ బాబు భార్య సంతోషికి ఆయన స్వయంగా తన చేతుల మీదుగా 5 కోట్ల రూపాయల చెక్క అందిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఆమెకు ఉద్యోగాన్ని,ఆమె ఉండడానికి నివాసస్థలం తాలూకు పత్రాలను కూడా అందిస్తారని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇక సీఎం కెసిఆర్ రాకను సంతోష్ బాబు కుటుంబానికి తెలిపి, ఐదు కోట్ల చెక్ స్వీకరించాలని కోరగా వారు ఒప్పుకున్నారని తెలిపారు. ఇక వారు తమతో పాటు దేశంలోని సైనికులకు సాయం చెయ్యటంపై మాట్లాడారని అన్నారు. ఇక సీఎం రాక సమాచారం వారి కుటుంబానికి ఇచ్చామని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు .
Recommended Video
సీఎం కేసీఆర్ మీద విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ ఆయన రాకపై ఆసక్తి
సంతోష్ బాబు పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. హరికృష్ణకు నివాళులు అర్పించారు గానీ దేశం కోసం అమరుడైన తెలంగాణ బిడ్డకు కల్నల్ స్థాయి అధికారికి నివాళులు అర్పించరా అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇక ఈ నేపధ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి బాసట అందిస్తామని చెప్పిన ఆయన స్వయంగా వారిని కలవనుండటంప్రాధాన్యత సంతరించుకుంది .