ఎమ్మెల్సీ ఎన్నికలు... తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు...? ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని గెలిచేందుకే..
ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు... మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సమీప భవిష్యత్తులోనే ఈ రెండింటికి ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రభుత్వం,ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తుండగా... ప్రధాన పార్టీలు అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం గట్టిగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర పైకి రావడం గమనార్హం.
ఖాళీ కానున్న రెండు స్థానాలు...
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావుల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదు కార్యక్రమం జరగనుంది. ఆ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్నికల్లో ఓటు కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం కోసం క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.
తెర పైకి బొంతు రామ్మోహన్ పేరు...
గతంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన ఉద్యోగ సంఘం నాయకుడు దేవిప్రసాద్ ఓడిపోయారు. బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు ఇక్కడ విజయం సాధించారు. మండలి ఏర్పాటు తర్వాత ఈ స్థానంలో ఇప్పటివరకూ టీఆర్ఎస్ గెలిచింది లేదు. దీంతో ఈసారి ఎలాగైన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ఈ స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన నేత కావడంతో గ్రాడ్యుయేట్స్లో బొంతు రామ్మోహన్కు మంచి ఫాలోయింగ్ ఉంటుందని.. ఉస్మానియా వర్సిటీతో ఆయనకున్న సత్సంబంధాలు కూడా కలిసొస్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే బొంతు రామ్మోహన్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోసం మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డినే బరిలో దింపే అవకాశాలున్నాయి.
Recommended Video
జీహెచ్ఎంసీ ఎన్నికలపై....
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు గురువారం(సెప్టెంబర్ 24) గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు,మేయర్లతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈసారి ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం కీలకంగా మారనుండటంతో దీనిపై నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే సమర్థులైన అభ్యర్థుల ఎంపికపై తగు సలహాలు,సూచనలు చేయనున్నారు. త్వరలోనే దుబ్బాక ఉపఎన్నిక కూడా జరగనుండటంతో అక్కడి రాజకీయ పరిస్థితులు,అభ్యర్థి ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.