వెళ్లడమే కరెక్ట్: నో డైలామా?, కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కేసీఆర్..
బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్ చక్రం తిప్పబోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. కర్ణాటక వెళ్లి తాను ఆ మాట చెప్పినప్పుడు.. ఓ జర్నలిస్టు మిత్రుడు పెద్దగా నవ్వాడని.. కానీ చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో! అని తాను ఆ జర్నలిస్టుతో చెప్పినట్టు కేసీఆర్ ఇటీవల పార్టీ వర్గాలతో వెల్లడించారు. నిజంగా కేసీఆర్ చెప్పినట్టే జరిగినప్పటికీ.. కాంగ్రెస్ తో అధికారాన్ని పంచుకోవడంపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతూ వస్తోంది.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..:
తాను చెప్పినట్టే జేడీఎస్ కింగ్ అవడం కేసీఆర్ కు సంతోషానిచ్చేదే అయినా.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఆయన దూరంగా ఉండవచ్చునన్న అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకోవడానికి ఆయన సుముఖంగా లేరని, కాబట్టి దాదాపుగా ఆ కార్యక్రమానికి ఆయన గైర్హాజరవుతారని అంతా ఒక అంచనాకు వచ్చారు. కానీ కేసీఆర్ మళ్లీ అందరి అంచనాలను తలకిందులు చేసేశారు.
వెళ్లడానికే మొగ్గు:
పార్టీ నేతలు, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లడమే మంచిదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొదట ఈ కార్యక్రమానికి అసలు దూరంగా ఉండాలని భావించినప్పటికీ.. ఫెడరల్ ఫ్రంటుకు అనుకూలంగా ఉన్న జేడీఎస్ తో దోస్తీ వదులుకోవద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. అధికార పీఠం జేడీఎస్ దే కాబట్టి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరవడమే మంచిదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఫ్రంటుకు మైలేజ్?:
కుమారస్వామి ప్రమాణస్వీకారం వేళ.. వేదికపై కేసీఆర్ ఉంటే.. దాని గురించి జాతీయ స్థాయిలో మరోసారి చర్చ జరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు. జేడీఎస్ 'కింగ్'గా అవతరిస్తుందని ఆయన ముందుగానే పసిగట్టడం మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలన్న కేసీఆర్ దృఢ సంకల్పం.. దాని కోసం ఆయన చేస్తున్న కృషి మరోసారి హైలైట్ అవుతాయి. భవిష్యత్తులో ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటుకు ఇవి మైలేజ్ ఇచ్చే అంశాలు కాబట్టి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లడానికే కేసీఆర్ నిశ్చయించుకున్నట్టు సమాచారం.
కేటీఆర్ ని పంపించాలనకున్నారు.. కానీ!:
నిజానికి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి తొలుత మంత్రి కేటీఆర్ ను పంపించాలని భావించినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా తాను వెళ్లడమే మంచిదని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అధికారులకు కూడా చెప్పడంతో.. ఆయన బెంగళూరు పయనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి కేసిఆర్ బెంగళూరు వెళ్తారని సమాచారం.