Huzurabad : హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆయనేనా...? గులాబీ బాస్ ఆ పేరును ఖరారు చేశారా..?
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరుపున ఈటల మినహా మిగతా పార్టీలు ఇప్పటికీ అభ్యర్థుల అన్వేషణలోనే ఉన్నాయి. దీంతో గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడం సాధ్యపడట్లేదు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప అక్కడ ఎవరి బలం ఎక్కువనేది ఒక అంచనాకు రావడం కష్టం. అభ్యర్థి ఖరారు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఎట్టకేలకు ఆ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటలపై బీసీ అస్త్రాన్ని సంధించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గులాబీ అభ్యర్థి ఆయనేనా...?
హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరుపున 'స్వర్గం రవి'ని బరిలో దింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన నేత కావడం... సుదీర్ఘ కాలంగా హుజురాబాద్ నియోజకవర్గంతో ఆయనకు అనుబంధం ఉండటం... కేసీఆర్ నిర్వహించిన సర్వేల్లోనూ ఆయనకు మంచి మార్కులు పడటంతో... గులాబీ బాస్ ఆయన వైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి,ముద్దసాని పురుషోత్తం రెడ్డి,ముద్దసాని మాలతి,గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరుల కంటే స్వర్గం రవి పైనే స్థానికంగా ఎక్కువ సానుకూలత ఉన్నట్లు టీఆర్ఎస్ సర్వేల్లో తేలిందని తెలుస్తోంది.
స్వర్గం రవికే ఎందుకు...?
స్వర్గం రవి గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఆయనకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి హుజురాబాద్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ కాంగ్రెస్లోనే క్రియాశీలకంగా కొనసాగుతూ వచ్చారు. తనకంటూ
సొంత కేడర్ను ఏర్పరుచుకుని ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ప్రగతి భవన్లో స్వర్గం రవి కేసీఆర్ను కలిశారు. బహుశా టికెట్ విషయం చర్చించేందుకే సీఎం ఆయన్ను పిలిపించారన్న ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థి ప్రకటనతో ఎవరి బలమెంతో తేలుతుందా?
ఈటల రాజేందర్ బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో బీసీ వర్గానికి చెందిన స్వర్గం రవినే ఆయనపై పోటీకి దింపే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.స్వర్గం రవిపై క్షేత్రస్థాయిలో సర్వే రిపోర్టులు తెప్పించుకున్న ఆయన... వాటిపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దీంతో త్వరలోనే స్వర్గం రవి అభ్యర్థిత్వాన్నికేసీఆర్ ఖరారు చేయవచ్చునన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే హుజురాబాద్లో మోహరించిన గులాబీ సైన్యం టీఆర్ఎస్ తరుపున విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కేసీఆర్ పేరు,కారు గుర్తే తమను గెలిపిస్తుందన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తే గ్రౌండ్లో ఎవరి బలమెంత అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.