నేడు గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ అందుకే ... మంత్రివర్గ విస్తరణలో పోటీలో ఉంది వీరే
తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయకుండా జాప్యం చేయడంతో ప్రతిపక్ష పార్టీల నుండి పలు విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది అన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి.అయితే మంత్రివర్గ విస్తరణపై ఇప్పటివరకు నోరుమెదపని కేసీఆర్ ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించారా ? అందుకే సీఎం కేసీఆర్ నేడు గవర్నర్ తో భేటీ కానున్నారా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
కేసీఆర్ నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తో చర్చించేందుకు నేడు అపాయింట్మెంట్ తీసుకున్నారు సీఎం కేసీఆర్. చాలాకాలంగా మంత్రి వర్గ విస్తరణ గురించి అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ క్యాబినెట్ లో మొదటి విడతలో 10 మందికి చోటు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అందులో దాదాపుగా కొత్త ముఖాలే వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రివర్గంలో చోటుకోసం ఎక్కువమందే ఆశావహులు పోటీపడుతున్నారు. గత కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారు ఈ సారి కూడా కేబినెట్లో స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారని దానిపై ఇంతవరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ పీక్స్ కి చేరుతోంది.
కేసీఆర్ జాతకరీత్యా పౌర్ణమి రోజులు మంచివి ... అందుకే విస్తరణకు ఛాన్స్
వాస్తు పట్ల, ముహూర్తాల పట్ల సీఎం కేసీఆర్ కు బలమైన విశ్వాసం ఉండటంతో మాఘమాసంలో అయినా క్యాబినెట్ విస్తరణ చేస్తారని అందరూ భావించారు. వసంత పంచమి నాడు క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత రథసప్తమి కూడా దాటిపోయింది. అయినా క్యాబినెట్ విస్తరణ విషయంలో ఏ నిర్ణయం ప్రకటించని కేసీఆర్ ఆయన గ్రహస్థితి ఆధారంగా పౌర్ణమి రోజులు ఆయన జాతకరీత్యా అత్యంత శక్తివంతమైన రోజులు కాబట్టి ఫిబ్రవరి 15 తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయడానికి అవకాశముందని తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా రేస్ లో ఉంది వీరే
కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం కోసం రంగారెడ్డి జిల్లా నుండి అరికెపూడి గాంధీ , మంచిరెడ్డి కిషన్రెడ్డి, కె.పి.వివేకానంద్గౌడ్ లు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ నుండి దానం నాగేందర్ , తలసాని శ్రీనివాస్యాదవ్, టి.పద్మారావుగౌడ్ లు పోటీపడుతున్నారు.ఆదిలాబాద్ జిల్లా నుండి జోగు రామన్న, అజ్మీరా రేఖానాయక్, కోనేరు కోనప్ప పోటీలో ఉన్నారు. మహబూబ్నగర్ నుండి సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పి.నరేందర్రెడ్డిలు, నిజామాబాద్ నుండి వేముల ప్రశాంత్రెడ్డి, ఆకుల లలిత , బాజిరెడ్డి గోవర్ధన్ లు మంత్రి రేసులో కనిపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుండి ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లా నుండి ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరి,డి.ఎస్.రెడ్యానాయక్ , అరూరి రమేశ్ లు అవకాశం వస్తుందని ఆశ పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నుండి పువ్వాడ అజయ్కుమార్ , పల్లా రాజేశ్వర్రెడ్డిలు, మెదక్ జిల్లా నుండి తన్నీరు హరీశ్రావు, పద్మా దేవేందర్రెడ్డి , సోలిపేట రామలింగారెడ్డిలు రేస్ లో ఉన్నారు. నల్లగొండ జిల్లా నుండి జి.జగదీశ్రెడ్డి, ఆర్.రవీంద్రనాయక్, గుత్తా సుఖేందర్రెడ్డి, గొంగిడి సునీత తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
మొత్తంమీద నేటి గవర్నర్ భేటీలో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ చర్చించనున్నారని మరో రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే విస్తరణ చేయనున్నట్లు తాజా రాజకీయ పరిణామాల ద్వారా అర్థం అవుతోంది.