కేసీఆర్ సంచలన ప్రకటన: ఎస్టీల విద్యుత్ బకాయిలు రద్దు, వ్యవసాయానికి ఉచితమే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. ప్రగతి భవన్లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
70కోట్ల బకాయిలు రద్దు, కేసుల ఎత్తివేత
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఎస్టీలకు కూడా గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామన్నారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని... 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్కో మాఫీ చేస్తుందని జెన్కో - ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు.
రూ. 125కే కనెక్షన్
ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు ఎత్తివేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతీ ఎస్టీ ఇంటికి రూ. 125 మాత్రమే తీసుకొని కరెంటు కనెక్షన్ ఇవ్వాలని... ప్రతీ ఇంటికి సర్వీస్ వైరు, వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేయాలని... 50 యూనిట్ల లోపు కరెంటు వాడుకునేవారికి ఎలాంటి ఛార్జీ తీసుకోకూడదని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎస్టీ ఆవాస ప్రాంతాలకు త్రీఫేజ్ కరెంటు అందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు, ప్రతీ ఎస్టీ ఇంటికి, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వాటితో సహా ప్రతీ ఎస్టీ వ్యవసాయ దారుడికి విద్యుత్ కనెక్షన్ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ ఎస్టీ ఆవాస ప్రాంతానికి రోడ్డు వేసేందుకు వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి స్థానికులకే ప్రవేశం కల్పించే విధానం అమల్లోకి తెస్తామని సీఎం వెల్లడించారు.
ఉచిత విద్యుత్..
రాష్ట్ర వ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా... 8,734 గ్రామాల్లో త్రీఫేజ్ కరెంటు లేదని... సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ అని సీఎం ఉద్ఘాటించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉన్న వారితో సహా ఎస్టీ వ్యవసాయదారులందరికీ... విద్యుత్ సర్వీసు సౌకర్యం కల్పించి, ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని... అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్మాణానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని, ఎస్టీ ఆవాస ప్రాంతాలన్నింటికీ రహదారి సౌకర్యం కల్పించాలని సంబంధిత మంత్రులను సీఎం ఆదేశించారు.
కమిటీలు వేసి.. ప్రాధాన్యత కల్పిస్తాం
రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల ఎస్టీ పిల్లలకు ఎంతో మేలు కలుగుతున్నదని... ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి స్థానికులకే అవకాశం దక్కే విధానం తీసుకు వస్తామని సీఎం తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇందుకోసం పథకాల రూపకల్పన చేయాలన్నారు. ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, స్వయం ఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాం నాయక్ నాయకత్వంలో కమిటీ, విద్యుత్కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో కమిటీని సీఎం నియమించారు.