ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్: ఇద్దరు చంద్రుల భేటీ, ఎవరి వాదన గెలుస్తోందో?
అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రులు ఈ నెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. బుధవారం మధ్యాహ్నాం 2.30 గంటల ప్రాంతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు జలవనరుల శాఖ మంత్రులు, సీఎస్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం రాత్రి గవర్నర్ నరసింహాన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 21న ఢిల్లీలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో గవర్నర్తో వివిధ అంశాలపై చర్చించారు.
వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ఆచరిస్తున్న విధానాలు, నెలకొన్న పరస్థితులపై గవర్నర్ నరసింహాన్కు కేసీఆర్ వివరించారు. ఇదిలా ఉంటే నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే దిశగా ఈ అపెక్స్ కౌన్సిల్లో చర్చలు జరగనున్నాయి.
ఈ సమావేశంలో మొత్తం 5 అంశాలను ఏజెండాగా చేర్చినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలతో పాటు సుప్రీం కోర్టులో ఉన్న రిట్ పిటిషన్లుపై చర్చ, గోదావరి జలాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని కలవనున్నారు.
మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై ఇరు రాష్ట్రాల సీఎంలు తీవ్ర కసరత్తులు చేశారు. తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి డిండి ఎత్తిపోతలకు అనుమతులు లేవని ఏపీ ప్రభుత్వం తమ వాదనను వినిపించాలని భావిస్తోంది.
పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు జలవనరులశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావడానికి ఇరువురు సీఎంలు అంగీకరించారు. సుప్రీం కోర్టులో కృష్ణా జిల్లా రైతులు వేసిన పిటిషన్పై వాదన, ప్రతివాదన కాపీలను ప్రభుత్వం తెప్పించుకుంది.
పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొత్తగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్రమమని ఏపీ ఫిర్యాదు చేయగా ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.
ఈ అంశంపైనే అపెక్స్ కౌన్సిల్లో వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన పాలనా పరమైన ఉత్తర్వులను, ప్రాజెక్టు వివరాలను కేంద్రానికి అందచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టుకు నీటిని జూరాల జలాశయం నుంచి తీసుకోవాలని ప్రతిపాదించగా తెలంగాణ ప్రభుత్వం నీటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పాలనా పరమైన ఉత్తర్వులను ఇవ్వడమే కాక టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి 90 టీఎంసీల వాటా తమకు వస్తుందని, ఈ నీటిని నాగార్జునాగర్ ఎగువన కృష్ణా బేసిన్లో వినియోగించుకునే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశంతో పాటు పోతిరెడ్డి పాడు జలాశయం నుంచి ఏపీ 38 టీఎంసీల నీటిని అక్రమంగా ఇటీవల వినియోగించుకుందని మంత్రి హరీశ్రావు ఇటీవల కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు.
కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్లో చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కృష్ణా బోర్డు పనితీరు, విధివిధానాలను ఖరారు చేయడానికి కేంద్ర జలసంఘం ఇటీవల ఒక కమిటీని నియమించడంతో ఈ కమిటీ నివేదిక వచ్చే వరకూ ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్లో చర్చించే అవకాశం లేదని ఏపీ అధికారులంటున్నారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఆర్. విద్యాసాగర్రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధరరావు పాల్గొంటారు. ఏపీ నుంచి కూడా సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికారులు పాల్గొంటారు.