మనుగోడులో సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ - తాజా సర్వే నివేదికలతో..!!
మునుగోడు ఉప ఎన్నిక పోరు ఆసక్తి కరంగా మారుతోంది. ఏ క్షణమైనా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా బీజేపీ ముఖ్య నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వారం లోగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ రెండో వారంలో బై పోల్ జరుగుతుందని చెబుతున్నారు. దీని కోసం మూడు ప్రధాన పార్టీలు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. దసరా నాడు జాతీయ పార్టీని ప్రకటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్..మునుగోడు లో విజయం పైన ధీమాగా ఉన్నారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలోనూ ఆయన మునుగోడు బై పోల్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
సర్వేలు అనుకూలమంటూ
అన్ని సర్వేలు టీఆర్ఎస్ గెలుపును స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఇక, టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. ఇందుకు ముహూర్తం - కార్యాచరణ ఫిక్స్ అయింది. ఇదే సమయంలో మునుగోడు బై పోల్ రానుంది. ఇతర పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసినా, టీఆర్ఎస్ అధికారికంగా తమ అభ్యర్ధిని ప్రకటించలేదు.
అభ్యర్ది ఎవరనేది తేల్చకుండా నే టీఆర్ఎస్ - కమ్యూనిస్టులతో కలిసి ప్రచారం కొనసాగిస్తోంది. షెడ్యూల్ విడుదల అయిన తరువాతనే ముఖ్యమంత్రి తమ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారుతున్న వేళ..మునుగోడు అభ్యర్ధి బీఆర్ఎస్ అభ్యర్దిగానే ప్రచారంలో నిలవనున్నారు.
అందులో భాగంగానే, ఇప్పటి వరకు అభ్యర్ధిని ప్రకటించలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. విజయ దశమి నాడు టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్ గా మార్పు చెందేలా తీర్మానం చేసినా, ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించేదాకా టీఆర్ఎస్ గానే కొనసాగనుంది.
బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు
సీట్లు - ఓట్లు ఆధారంగా ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ- జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మునుగోడు ఫలితం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇక్కడే బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు - ఇతర రాష్ట్రాల్లో బలం పెంచుకొనే దిశగా కేసీఆర్ ఫోకస్ చేయటంతో, ఇదే సమయంలో సొంత రాష్ట్రం లోనే కేసీఆర్ ను ఢిఫెన్స్ లోకి నెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో బీజేపీ మునుగోడు అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణతో పాటుగా మునుగోడు పరిస్థితుల పైన చర్చించారు. బీజేపీ నేతలు సైతం మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అండగా ఉంటామని చెబుతున్నారు. పార్టీ జాతీయ నేత సునీల్ బన్సాల్ తెలంగాణలోనే మకాం వేసారు. మునుగోడు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
జాతీయ పార్టీ వేళ..కేసీఆర్ కు సవాల్ గా
అటు కాంగ్రెస్ మునుగోడులో స్థానికంగా బలం ఉన్న పాల్వాయి కుటుంబానికి టికెట్ ఖరారు చేసింది. బీజేపీ - కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వటంతో సీసీఎం కేసీఆర్ కూడా అదే విధంగా నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా పార్టీలో వినిపిస్తోంది.
కానీ, ఈ సారి పథకాలు - పార్టీలో చేరికలు- ప్రత్యేకంగా నిధుల కేటాయింపు వంటి అంశాలకు టీఆర్ఎస్ అధినాయకత్వం దూరంగా ఉంటోంది. తన రాజీనామాతో మునుగోడుకు నిధులు వస్తాయని రాజగోపాల్ చేసిన ప్రచారానికి విలువ లేకుండా చేయటం ఆ వ్యూహం లో తొలి భాగం. కాంగ్రెస్ - రాజగోపాల్ మధ్య ఓట్ల చీలక ఉంటుందని, తమ ఓట్ బ్యాంకు తమ వైపే ఉంటుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అదే తమకు లాభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడ అటు జాతీయ పార్టీ - ఇటు మునుగోడు బై పోల్ తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచుతున్నాయి.