రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. వారం రోజుల్లో ప్రతీ రైతు ఖాతాలో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని ప్రతీ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు, ఒక్క ఎకరా మిగలకుండా,ఒక్క రైతు కూడా పెట్టుబడికి ఇబ్బంది పడకుండా.. రైతులందరికీ రైతు బంధు సాయం అందించాలని చెప్పారు. వారం,పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఈ ఏడాది నుంచి నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలుచేస్తున్నందునా.. రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ చేయాలని చెప్పారు. సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
పోతిరెడ్డి పాడు వివాదం.. కేసీఆర్-జగన్ చీకటి ఒప్పందాలు... కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు...
రూ.7వేల కోట్లు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు పంటలకు రూ.5వేలు చొప్పున రైతు బంధు కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వానాకాలంలో రైతు బంధు అమలుకు రూ.7వేల కోట్లు అవసరం కాగా.. ఇప్పటికే రూ. 5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో వారం రోజుల్లో రూ.1500 కోట్లు కూడా వ్యవసాయ శాఖకు బదిలీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.
వ్యవసాయ విప్లవం సృష్టిస్తామంటున్న సీఎం
రాష్ట్ర రైతులు నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విధానం కేవలం ఒక సీజన్ కోసమో లేదా ఒక పంట కోసమో ప్రవేశపెట్టిన విధానం కాదన్నారు. రాష్ట్రంలో రాబోయే వ్యవసాయ విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని.. ధాన్యం అమ్మకం మొదలు,అనేక సమస్యల పరిష్కారానికి రైతు కేంద్రంగా ఇందులో సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. భవిష్యత్తులో కాళేశ్వరం,సీతారామ,పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే రాష్ట్రంలో కోటి 30లక్షల ఎకరాలు సస్య శ్యామలం అవుతాయన్నారు.
ఇదీ నియంత్రిత వ్యవసాయ విధానం..
నియంత్రిత వ్యవసాయ విధానంలో.. ఈ వానాకాలంలో మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు పంటలసాగు చేపట్టనున్నారు. ఇందులో 41,76,778 ఎకరాల్లో వరి, 12,31,284 ఎకరాల్లో కందులు, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్, 60,16,079 ఎకరాల్లో పత్తి, 1,53,565 ఎకరాల్లో జొన్నలు, 1,88,466 ఎకరాల్లో పెసర్లు, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నారు.
నియంత్రి పద్దతితో కలిగే మేలు...
మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని.. ఆ రకం పంటలే వేయడం ద్వారా రైతులకు లాభాలు కలిగేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇకనుంచి ప్రభుత్వం సూచించిన పంటలనే వేసి రైతులు లాభాలు ఆర్జించాలని చెబుతోంది. డిమాండ్ ఉన్న పంటలే పండించడం ద్వారా రైతులకు మద్దతు ధర,కొనుగోలు సమస్య తలెత్తదని చెబుతోంది. అంతేకాదు,ఎప్పుడూ ఒకే రకం పంట వేస్తే.. ఆ ధాన్యానికి అలవాటైన బాక్టీరియా అక్కడే తిష్ట వేస్తుందని చెబుతోంది. పంటల మార్పిడి వల్ల బాక్టీరియాను అరికట్టడంతో పాటు భూమి సారం దెబ్బతినదని.. లవణీయత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతోంది.