వనదేవతలను దర్శించుకొన్న సీఎం కేసీఆర్, పట్టువస్త్రాలు, నిలువెత్తు బంగారం సమర్పణ
వన దేవతలు సమ్మక్క సారాలమ్మను ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకొన్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం కానుకగా సమర్పించారు. గిరిజన పూజారులు మంత్రోచ్చరణాలతో దీవించారు. అమ్మవారికి సీఎం కేసీఆర్ పూలమాల వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్తో ఎంపీ సంతోష్కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. సీఎం కేసీఆర్ దర్శన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
Recommended Video
సమ్మక్క-సారాలమ్మకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వస్తోన్నందున అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీఎం వచ్చి వెళ్లేవరకు భక్తులను అనుమతించలేదు. శుక్రవారంతో జాతర ముగియనుండటంతో మేడారంలో ఆశేష జనవాహిని పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనం.. వన దేవతల దర్శనం కోసం బారులుతీరారు. అంతకుముందు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.
సీఎం కేసీఆర్ కన్నా ముందు గవర్నర్లు తమిళి సౌ సౌందరరాజన్, బండారు దత్తాత్రేయ కూడా అమ్మవార్లను దర్శించుకొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క-సారాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. అమ్మవారికి బంగారం సమర్పించారు. గవర్నర్లకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించారు.