ఎమ్మెల్యేకు షాక్: కల్వకుర్తి రెవెన్యూ డివిజన్పై కేసీఆర్, 'పిచ్చోడి చేతిలో రాయిలా'
హైదరాబాద్: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మంగళవారం ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డితోపాటు కలెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ అంశాన్ని పరిశీలించాలని వారికి సూచించారు. అయితే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ అయ్యే అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్, మాడుగుల, తలకొండలపల్లి గ్రామాలు కొత్తగా ఏర్పడే కళ్తాల మండలలోకి వెళ్తున్నాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై శాస్త్రీయత లోపించిందని అన్నారు. జనగామ, గద్వాల, సిరిసిల్ల జిల్లాలపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పై ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.
కేకే నివాసంలో హై పవర్ కమిటీ భేటీ
కొత్త జిల్లాల డిమాండ్లను పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైవపర్ కమిటీ మంగళవారం బంజారాహిల్స్లోని రాజ్యసభ సభ్యుడు కేకే నివాసంలో సమావేశమైంది. మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభాకర్రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.
నాలుగు జిల్లాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుపై వచ్చిన డిమాండ్లను పరిశీలించి ఈనెల 7వతేదీ మధ్యాహ్నం లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.