ఆర్టీసీ సమ్మెపై సాయంత్రం 4 గంటలకు మరోసారి సమీక్ష జరపనున్న సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమావేశాన్ని మరోసారి నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఐకాస చేపడుతున్న సమ్మె ఉదృతమైన నేపథ్యంలోనే తాజా పరిస్థితులు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై మంత్రులు మరియు అధికారులతో మధ్యాహ్నాం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. ముఖ్యంగా సమ్మె ఉదృతం కావడం, ప్రతిపక్ష పార్టీలు వారికి మద్దతు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆదివారం నాటీ సమావేశానికి కొనసాగింపుగానే ఈ భేటీ జరగనుంది.
కేసీఆర్ మరో తప్పు చేయకు.. నిరంకుశం వద్దు: కోదండరాం వార్నింగ్.. జీతాల కోసం సమ్మె కాదు!
రవాణ అధికారులతో భేటి అయిన సీఎం
మరోవైపు ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు సీఎం ప్రకటించిన నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా చేపట్టిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదలనపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ రవాణశాఖ అధికారులతో కాసేపటి క్రితమే భేటి అయ్యారు. ప్రగతి భవన్లో అధికారులు సీఎం ఆదేశాల మేరకు చేసిన ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచారు. కాగా సాయంత్రం నాలుగు గంటలకు చర్చించాల్సిన అంశాలు, తీసుకువాల్సిన నిర్ణయాలపై సీఎం కేసీఆర్ కూలంకూషంగా చర్చిస్తున్నారు.
సీఎం ఆదేశాలతో నివేదిక సిద్దం చేసిన అధికారులు
కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బంది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ వుంటుందని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏఏ కేటిగిరికి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటిగిరిలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం వుంటుందని ఆయన అన్నారు. దీంతో ఇందుకు అనుగుణంగా రవాణ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
15 రోజుల్లో ఆర్టీసీ పునర్వైభవం సీఎం కేసీఆర్
ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే... ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుంది అని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేటి భేటీలో కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నందన్నది ఆసక్తికరంగా మారింది.