ఇదీ సంగతి: న్యాయ సమస్యలు తలెత్తొద్దు.. టీచర్ల నియామకంపై కేసీఆర్ ఆదేశం
‘లంకణం దివ్యౌషధం' అని నానుడి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
హైదరాబాద్: 'లంకణం దివ్యౌషధం' అని నానుడి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. అందుకు జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా ఎటువంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చూడాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
మూడేళ్ల క్రితం కొలువు దీరిన నాడు ప్రభుత్వోద్యోగాలన్నీ భర్తీచేస్తామని బాసలు చేసింది. అసెంబ్లీ సాక్షిగా లక్ష పై చిలుకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆచరణలో పాలనలో ఇబ్బంది లేకుండా అత్యవసరమైన ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగానే వివిధ శాఖల్లో రమారమీ ఏడెనిమిది వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టింది. మరో పది వేల మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంలో హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి సర్కార్ వారిది.
ఉద్యోగ నియామకాల
ఇక గ్రూప్ - 2 ఉద్యోగ నియామకాలపై విధించిన స్టే తొలగిపోలేదు. ఇటీవల కొత్త గురుకులాల్లో టీచర్ల నియామకానికి మహిళా అభ్యర్థులకే పరిమితం కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అనివార్య కారణాలతో కొట్టేసినా.. వివిధ ఉద్యోగ నియామకాలకు చేపట్టిన ప్రక్రియ న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే నియామకాలపై హైకోర్టు స్టే విధించేలా వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో కీలకమైన వారే తమ వద్దకు వచ్చే నిరుద్యోగులకు కోర్టుకు వెళ్లండని సూచిస్తున్నారని వినికిడి. (TSPSC logo)
Recommended Video
దాటవేత కోసమే ప్రభుత్వ వ్యూహమా?
ఇటీవల రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విభాగాల్లోని 27 వేల మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పబట్టింది. మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగానే వారికి అదే వేతనం చెల్లించాలని ఆదేశించింది. కనుక ప్రస్తుతానికి తామేం చేయలేమని తప్పించుకునేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కిందన్న అభిప్రాయం ఉంది. తాజాగా రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకున్నట్లు కనిపిస్తోంది. మరి వచ్చేనెల 11వ తేదీలోగా ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విన్నవించడంతో టెట్ ఫలితాలు వెలువడిన వెంటనే డీఎస్సీ నిర్వహిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీం కోర్టుకూ ఇదే విషయం తెలిపింది.
కొత్త జిల్లాల వారీగా నియామకానికి సర్కార్ కసరత్తు
కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినా దానివల్ల కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో మాత్రమే ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. స్థానికత ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలు చేసి ఆ తర్వాత ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని.. పాత జిల్లాల వారీగా డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 8,792 ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. కొత్త జిల్లాల వారీగా అయితే కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ ఖాళీలు ఉంటాయన్నది అభ్యర్థుల్లో ఉన్న ఆందోళన. అయితే వాటి సంఖ్యను పెంచవచ్చా? లేదా? అని కూడా పరిశీలించాలని సూచించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలపైనా చర్చించినట్లు సమాచారం.
అధికారులకు ఇలా సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం
డీఎస్సీ నిర్వహణకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో చర్చించి మళ్లీ విధి విధానాలు తయారు చేసుకొని రావాలని విద్యాశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకొని విధి విధానాలు, నిబంధనలు, విద్యార్హతలు తదితర వాటిపై పకడ్బందీగా నివేదికతో మళ్లీ రావాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ నిర్వహించే అంశంపై ఆయన శనివారం గంటపాటు అధికారులతో చర్చించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ సమావేశంలో పాల్గొన్నారు.