పనుల్లో వేగం పెరగాలి.. ప్రాజెక్టులు పూర్తవ్వాలి.. సీఎం దిశానిర్దేశం
హైదరాబాద్ : రెండోసారి అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనులపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. అందులోభాగంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి తలమానికంగా నిలవనున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.
మంగళవారం నాడు మేడిగడ్డ, కన్నెపల్లి పంపుహౌసులు పరిశీలించిన కేసీఆర్.. రాత్రి కరీంనగర్ లో బస చేశారు. తిరిగి బుధవారం నాడు రెండో రోజు పర్యటనకు వెళ్లారు. ఉదయం హెలికాప్టర్ లో కన్నెపల్లికి చేరుకున్న కేసీఆర్.. వివిధ పనులను నిశితంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 13.2 కిలోమీటర్ల మేర జరుగుతున్న గ్రావిటీ కాలువ పనులను పరిశీలించారు కేసీఆర్. రోడ్డు మార్గంలో పయనించి 4 చోట్ల గ్రావిటీ కాలువ పనులు వీక్షించారు. అయితే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని గుర్తించి త్వరితగతిన పూర్తిచేయాలంటూ అధికారులను ఆదేశించారు. లైనింగ్ పనులను మరింత స్పీడప్ చేయాలని సూచించారు.
కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీ దగ్గరకు చేరుకున్నారు కేసీఆర్. అక్కడి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే 66 గేట్లు బిగించి దాదాపు 90 శాతం పనులు పూర్తిచేయడంతో అధికారులను అభినందించారు. మిగిలిన పనులు వీలైనంత స్పీడ్ గా పూర్తిచేయాలని కోరారు. అక్కడినుంచి నేరుగా వెళ్లి పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ దగ్గరకు చేరుకున్నారు. గ్రావిటీ, బ్యారేజీ పనులు నెమ్మదించాయని.. స్పీడప్ చేయాలని సూచించారు. మార్చి నెల చివరివరకు నిర్మాణం పనులు పూర్తికావాలని ఆదేశించారు. యుద్ధప్రతిపాదికన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేయాలని కోరారు.