జయప్రకాశ్ నారాయణ తెలంగాణా ఉద్యమ వ్యతిరేకి... ఆయనకు కాళేశ్వరం గురించి ఏం తెలుసన్న కేసీఆర్
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన కరెంట్ బిల్లుపై పెద్ద చర్చే జరుగుతుంది. వేల కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్ట్ కి విద్యుత్ వినియోగంపై, విద్యుత్ బిల్లులు పెను భారంగా మారతాయన్న లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణాతో జేపీకి ఏం సంబంధం .. మొదటి నుండీ జయప్రకాశ్ నారాయణ తెలంగాణా వ్యతిరేకి అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించి ఆ పర్యటనలో భాగంగా ఆయన ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై విమర్శలు చేశారు.
తెలంగాణపై ఈర్ష్యతోనే కాళేశ్వరం ప్రాజక్టుపై జేపీ వ్యాఖ్యలన్న సీఎం కేసీఆర్
ఎవరో పిచ్చోళ్ళు ఏదేదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు . జయప్రకాశ్ నారాయణ తెలంగాణపై ఈర్ష్యతోనే కాళేశ్వరం ప్రాజక్టుపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కాళేశ్వరం ప్రాజక్టు గురించి జయప్రకాశ్ నారాయణకు ఏం తెలుసని మాట్లాడుతున్నారని నిలదీశారు. ఏనాడైనా మేడిగడ్డ ప్రాజక్టు వద్దకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. అసలు ఆయనకు మేడిగడ్డ ఎక్కడ వుందో తెలుసా అని విమర్శలు గుప్పించారు . ఇలాంటి నేతల విమర్శలను తాము పట్టించుకోబోమని తాము చెయ్యాలనుకున్న పని బరాబర్ చేసి తీరతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రజలకు శషబిషలు అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు, నిర్వహణా వ్యయం రాష్ట్ర ప్రజలకు భారమే అన్న జయప్రకాశ్ నారాయణ్
అసలు ఇంతకీ జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే వేల కోట్ల రూపాయల ఖర్చుతో అప్పుచేసి మరీ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయానికి తెచ్చిన అప్పుపై వడ్డీ, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహణా వ్యయం , నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే విద్యుత్ ఖర్చు అన్నీ తడిసి మోపెడు అవుతున్నాయని అసలేమాత్రం అంచనా లేకుండా 40 లక్షల ఎకరాలకు నీరిస్తాం ... రైతు ఉత్పాదక శక్తిని పెంచుతామని చెప్తూ డ్రామాలాడుతున్నారని జేపీ తెలంగాణా సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలను బట్టి వేసిన అంచనా ప్రకారం ఎకరానికి సాగు నీరు అందించటానికి 25 వేలు ఖర్చు అవుతుందని ఇదంతా ప్రజల మీద పడుతున్న ఆర్ధిక భారం కాదా అని జేపీ ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మోసం చెయ్యొద్దని అన్నారు జేపీ .
కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ ఖర్చు ,నిర్వహణా వ్యయం తెలంగాణా రాష్ట్రానికి పెను భారం అన్న జేపీ
100 రూపాయలు పెట్టుబడి పెడితే 200 ఆదాయం రావాలి కానీ తెలంగాణా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వేల కోట్ల ఖర్చు చేసి ఇక నీరు ఇవ్వటానికి కూడా వేల కోట్లు ఖర్చు చేస్తే ఇదంతా రాష్ట్ర ప్రజల మీద పడే ఆర్ధిక భారం కాదా అని జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఒక మీడియా తో మాట్లాడిన ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కాలం నుండి దుమారం రేపుతున్నాయి. అన్నిటినీ లెక్కలు చేసి మరీ చెప్పిన జేపీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహణా వ్యయం తెలంగాణా రాష్ట్రానికి పెను భారం అని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలపైనే సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణా వ్యతిరేకుల మాటలు నమ్మవద్దని చెప్పారు. జీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు .