ఏపీలో ఏమీ లేదు, సిద్ధమా: కేసీఆర్ ముందస్తు ఎన్నికల సంకేతాలు, సర్వే.. అక్కడ బీజేపీదే గెలుపు!
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము వంద స్థానాలకు పైగా గెలుస్తామని, అలాగే మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్గడ్లలో మళ్లీ అక్కడ ఉన్న సీఎంలే గెలుస్తారట అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఏపీ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మనకు ఇక్కడ తెలంగాణలో తెలివితక్కువ దుష్మన్లు ఉన్నారని విపక్షాలను ఉద్దేశించి మండిపడ్డారు.
తెలివి తక్కువ దుష్మన్లతో మా వాళ్లు కూడా మొద్దుబారిపోతున్నారని వ్యాఖ్యానించారు. గ్రేటర్ చరిత్రలోనే 99 స్థానాలు గెలిచామన్నారు. కానీ తెలంగాణలో తెలివైన వాళ్లు ఉన్నారని అర్థమైందన్నారు. ఆలిండియా సివిల్స్ టాపర్ అనుదీప్ తెలంగాణ ముద్దుబిడ్డే అన్నారు. క్రియాశీలకంగా పని చేస్తే పదవులు వస్తాయన్నారు. అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ఉద్యమం సమయంలో నేను చెప్పిందంతా నిజమైందన్నారు.
మాకు వందకు పైగా స్థానాలు
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వందకు పైగా స్థానాలలో గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వే ఫలితాలు త్వరలో విడుదల చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2020 జూన్ కల్లా తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా పచ్చని పంట పొలాలు కనిపిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లను చూస్తే తనకు నవ్వు వస్తోందన్నారు. హోంగార్డులకు అత్యధిక జీతం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. నాలుగేళ్లలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోను ముందున్నామని చెప్పారు. 90 అవార్డులు తెలంగాణ తీసుకుందన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ?
రాష్ట్రం వస్తే తెలంగాణ చిమ్మచీకటి అవుతుందన్న నాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే కాంగ్రెస్ వాళ్ల దిక్కుమాలిన కర్తవ్యమని మండిపడ్డారు. తెలంగాణ రైతులు రూ.లక్ష కోట్ల పంట పండిస్తున్నారని చెప్పారు.అక్కర మందం దోస్తాన ఉండదని చెప్పారు. మజ్లిస్ పార్టీతో సంస్కారవంతంగా ఉంటామన్నారు. నేడు తెరాస చేసిన పనులు ఇన్నేళ్లుగా వారు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
మంచివాళ్లు మళ్లీ గెలుస్తారు!
ఒడిశాలో నవీన్ పట్నాయక్ మళ్లీ గెలుస్తారట అని కేసీఆర్ చెప్పారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలోను మళ్లీ అక్కడి ముఖ్యమంత్రులే గెలుస్తారట అన్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మంచిగా పని చేసే వాళ్లను జనం అభిమానిస్తారని చెప్పారు. తద్వారా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, ఒడిశా సీఎం పట్నాయక్ను సమర్థించారు.
పక్కన ఏపీని చూస్తున్నాం
పక్కన ఉన్న ఏపీని మనం చూస్తున్నామని, అక్కడ దమ్కీలు తప్ప ఏమీ లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ ఎద్దేవా చేశారు. మేము అంత.. ఇంత అన్నారని, ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో ఎలాంటి అనుమానం లేకుండా వచ్చే ఎన్నికల్లో తెరాసనే గెలుస్తుందన్నారు. ఎన్నికలు జరగాలి కాబట్టి జరుగుతాయి అంతే అన్నారు. వచ్చేసారి హైదరాబాదుకు టాప్ ప్రయారిటీ అన్నారు.
ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చిన కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. ముందస్తుగా ఎన్నికలకు పోదామని అడుగుదామనుకుంటున్నామని చెప్పారు. చిల్లర మల్లర మాట్లాడవద్దని విపక్షాలపై మండిపడ్డారు. జనం కూడా ముందస్తు వైపు ఉన్నారని చెప్పారు. పోదాం.. పద సర్.. ఏదో ఒకటి అయిదది అని అంటున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.