సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు విధానాలు: కేసీఆర్పై మండిపడ్డ భట్టి
హైదరాబాద్: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ జాతికి చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పగా వర్ధిల్లుతున్నదంటే ఆ ఖ్యాతి అంబేద్కర్కే దక్కుతుందని పేర్కొన్నారు.
కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి కేడర్ లేని ప్రాంతాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి చేర్చుకుని, ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ పార్టీ బలం పెంచుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు విధానాల ద్వారా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలు అరికట్టేందుకు పనిచేస్తామన్నారు. భవిష్యత్ ను ముందుగానే ఊహించిన రాజ్యాంగ నిర్మాత అందుకే కొన్ని విధివిధానాలు రూపొందించారని, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఫిరాయింపులకు తెరతీయడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి వచ్చే వారి సహాకారం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ నేత దానం నాగేందర్కు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పదవులిచ్చిందని, అటువంటి దానం కాంగ్రెస్ పార్టీని వీడతారని తాననుకోవడం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన వారికి అభినందనలు తెలిపారు.
మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్: మహేందర్రెడ్డి
దళితుల హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఆయన శంషాబాద్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దళితుల హక్కుల రక్షణకు స్ఫూర్తినిచ్చిన ప్రధాత అంబేద్కర్ అని వ్యాఖ్యానించారు.
12 సీట్లు మావే: కెకె
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 సీట్లు తామే గెలుచుకుంటామని టిఆర్ఎస్ నేత కె కేశవ రావు ఆదివారం చెప్పారు. ఖమ్మంలో కూడా తమకు మెజార్టీ ఉందన్నారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల పైన విపక్ష నేతలతో సంప్రదింపులు జరపలేదన్నారు. జానారెడ్డితోను మాట్లాడలేదన్నారు. కాగా, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ భూపతి రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని టిఆర్ఎస్ ఖరారు చేసింది.