ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే: వైయస్ రాజశేఖర రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలు
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎన్నోసార్లు వైయస్ పైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రశంసలు కురిపించారు. దీంతో ఏపీలో వైసీపీ అధినేత వైయస్ జగన్, తెరాస మధ్య జరుగుతున్న చర్చలకు మరో అడుగు అని అంటున్నారు.
జగన్పై ఎందుకు దాడి చేశానో చెబుతా: నిందితుడు, జైల్లో రాసిన పుస్తకంలో కీలక అంశాలు
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం సందర్భంగా ఆదివారం కేసీఆర్ మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ బాగుందని చెప్పారు. ఆరోగ్యశ్రీకి అదనంగా కలిపి ఆ పథకాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పారు. దీని కంటే కేంద్రం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ గొప్పదేమీ కాదని చెప్పారు. ఆరోగ్యశ్రీలో మార్పుల్లేకుండా అమలు చేస్తున్నామన్నారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందే అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు
కాంగ్రెస్ పార్టీపై కూడా కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు హుందాగా వ్యవహరించారని చెప్పారు. ఇందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను అభినందిస్తున్నానని చెప్పారు. తాము ఎన్ని రోజులైనా అసెంబ్లీని నడిపిస్తామని, ఏ విషయం పైన అయినా చర్చకు సిద్ధమన్నారు. విపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారం కావాలని చెప్పారు. తాము రైతు పక్షపాతిగా ఉంటామన్నారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు ఇవ్వలేమని చెప్పారు. కరెంట్ రెప్పపాటు కూడా పోకుండా చూస్తామన్నారు.
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
తమ పార్టీపై మళ్లీ విశ్వాసం ఉంచిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ సభలో చెప్పారు. పేదరికంతో పాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదని కేసీఆర్ చెప్పారు. ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు తీసుకు వచ్చామని చెప్పారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామన్నారు.
లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లు
తాము ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని కేసీఆర్ చెప్పారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వంలో భాగమని, కేబినెట్ ఆమోదించిందే గవర్నర్ చదివారని చెప్పారు. మరోలా చదివితే అప్రజాస్వామికం అవుతుందని చెప్పారు. గత మేనిఫెస్టోలో తాము చెప్పని 72 పథకాలు అమలు చేశామన్నారు. ఇప్పటి మేనిఫెస్టోకు అయిదేళ్ల సమయం ఉందని చెప్పారు. తాము రుణమాఫీ చేస్తామని, కానీ ఒకేసారి చేయమని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లను లాటరీ పద్ధతిలో ఇస్తామని చెప్పారు.