రెండే పతకాలు సాధించిందన్న విమర్శ: సింధుకు 5కోట్ల చెక్కు ఇచ్చిన కేసీఆర్
హైదరాబాద్: విశ్వ క్రీడా పోటీలకు హైదరాబాద్ను వేదికగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్యాంప్ ఆఫీసులో సోమవారం సాయంత్రం బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ ను సీఎం కేసీఆర్ సన్మానించారు. రియో ఒలింపిక్స్లో భారత్ తరుపున కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సింధు, కోచ్ గోపీచంద్ను కేసీఆర్ అభినందించారు.
క్రీడారంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం 'రాజీవ్ఖేల్ రత్న' పీవీ సింధుకు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధు భవిష్యత్లో ఇదే ఆటతీరును కొనసాగిస్తూ దేశానికి, రాష్ర్టానికి మరిన్ని పతకాలను సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అనంతరం రియో ఒలింపిక్స్లో భారత్కు రజతం సాధించిన పీవీ సింధుని అభినందించారు.
అనంతరం పీవీ సింధుకు సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. పుల్లెల గోపిచంద్ను కూడా అభినందించి కోటి రూపాయల చెక్కును అందించారు. తెలంగాణ జిల్లాల్లో కూడా అకాడమీ పెట్టాలని గోపీచంద్ను కోరారు. అలాగే సింధును క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలను సీఎం అభినందించారు.
పీవీ సింధుకు ఫిజియో థెరపిస్ట్గా వ్యవహరించిన కిరణ్కు రూ. 25లక్షలు, ఒలింపిక్స్లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్కు రూ.25లక్షల నజరానాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పీవీ సింధులాంటి క్రీడాకారుల్ని తయారు చేయడానికి రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు.
బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానాన్ని ప్రకటిస్తామని అన్నారు. పెద్దదేశమైన భారత్, కేవలం రెండే పతకాలు సాధించిందన్న విమర్శ ఉందని అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం దక్కలేదనే భావన ఉందని అన్నారు. త్వరలో క్రీడా సంఘాల నేతలతో సమావేశమై విధివిధాలను రూపకల్పన చేస్తామని అన్నారు.
ఈ కాలం విద్యార్ధులు పరీక్షలే లక్ష్యంగా మారడంతో క్రీడల్ని పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది ప్రతిభావంతులున్నారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసం ప్రతి జిల్లాలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని అన్నారు.
సీఎం కేసీఆర్ను కలిసిన పీవీ సింధు, కోచ్ గోపీచంద్
హకీం పేటలో క్రీడల కోసం కేటాయించిన 300 ఎకరాలను వినియోగించాలని అన్నారు. పీవీ సింధుతోపాటు ఆమె కుటుంబసభ్యులు, కిదాంబి శ్రీకాంత్ సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అంతక ముందు రాజ్భవన్కు వచ్చిన పీవీ సింధు కుటుంబసభ్యులు, కిదాంబి శ్రీకాంత్, గోపీచంద్లకు గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ను కలిసిన పీవీ సింధు, కోచ్ గోపీచంద్
రియో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రతిభను కనబర్చిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ దంపతులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో ప్రముఖుల సమక్షంలో పీవీ సింధుతో కేక్ కట్ చేయించి గవర్నర్ దంపతులు తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.
సీఎం కేసీఆర్ను కలిసిన పీవీ సింధు, కోచ్ గోపీచంద్
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహాన్ మాట్లాడుతూ పీవీ సింధు, గోపిచంద్ ను చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. వీరు మెడల్ కోసం ఆడలేదని దేశం కోసం ఆడారని అన్నారు. ఈ తరం యువతకు సింధు రోల్ మోడల్ అని గవర్నర్ నరసింహాన్ కొనియాడారు. క్రమ శిక్షణ, అంకితభావమే ఆమెను ఈ మెడల్ సాధించేలా చేశాయని అన్నారు.
గవర్నర్ను కలిసిన పీవీ సింధు, కోచ్ గోపీచంద్
సింధు మాట్లాడుతూ గవర్నర్ నరసింహాన్ ఆశీర్వాదం తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చామని అన్నారు. రాజ్ భవన్లో ఈ సన్మానం తాము ఊహించలేదని చెప్పిన సింధు, ఊహించని విధంగా గవర్నర్ మమ్మల్ని సన్మానించారని ఎంతగానో సంతోషపడింది.