ఇందిరా,ఎన్టీఆర్ హయాంలోనూ ఇంత ప్రభంజనం లేదు.. శిరస్సు వంచి ప్రజలకు కృతజ్ఞతలు : కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 360 డిగ్రీలు ఒకే రకమైన తీర్పు వెలువరించారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది,సంక్షేమాలు పథకాలపై చర్చోపచర్చల తర్వాత ప్రజలు మరోసారి టీఆర్ఎస్ను అద్భుతంగా బలపరిచారని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని.. నిర్దేశించుకునే లక్ష్యం వైపు నడవండి అని తాజా ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. తమ పార్టీ అవలంభిస్తున్న అన్ని మతాలు కులాలను కలుపుకుపోయే సెక్యులర్ పద్దతి అందరికీ నచ్చిందని అభిప్రాయపడ్డారు.
ఇంతటి విజయాన్ని అందించినందుకు వ్యక్తిగతంగా, పార్టీ పక్షాన శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. అలాగే పార్టీ విజయం కోసం కష్టపడిన నేతలందరికీ హృదయపూర్వక అభినందనలు అని, కేటీఆర్కు ప్రత్యేక అభినందనలు చెబుతున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
స్థిరంగా భారీ విజయాలు..
డిసెంబర్,2018లో శాసనసభ రద్దు చేసినప్పుడు అనేక అనుమానాలు,జోస్యాలు వినిపించాయని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ 88 స్థానాల్లో గెలిచామన్నారు. ఇటీవలి కాలంలో హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలవడంతో పార్టీ బలం 89 స్థానాలకు పెరిగిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమకే మెజారిటీ స్థానాలు వచ్చాయన్నారు.తదనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32 జెడ్పీటీసీలను గెలవడం ఆలిండియా రికార్డు అని చెప్పారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ త్వరగా ముగిసిపోతే రాష్ట్ర అభివృద్దిపై తాము దృష్టి పెట్టవచ్చునని భావించామని.. కానీ ఎన్నికలను ఆపేందుకు కొంతమంది విశ్వప్రయత్నాలు చేశారని.. కోర్టుల చుట్టూ తిరిగారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది.. : కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ముక్త కంఠంతో తీర్పు చెప్పారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఏకపక్షంగా ఫలితాలు రావని.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్టీఆర్,ఇందిరా హయాంలోనూ ఇలాంటి ప్రభంజనం చూడలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో మద్య నిషేధం ప్రకటిస్తే.. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచామని గుర్తుచేశారు. కానీ మద్య నిషేధంతో ఆదాయం పడిపోవడంతో సేల్స్ ట్యాక్స్ పెంచామని.. ఆ ప్రభావంతో మున్సిపల్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామన్నారు. కానీ తమ పాలనలో ప్రతీ ఎన్నికలోనూ భారీ స్థాయిలో స్థిరమైన విజయాలను గెలుచుకోవడం నిజంగా సంచలనమే అన్నారు.
మొరిగే కుక్కలున్నాయి..
ఇక నిరంతరం మొరిగే కుక్కలు కొన్ని ఉన్నాయని.. మాటలకు అడ్డూ అదుపూ లేకుండా, ఏమాత్రం విలువలు లేకుండా అడ్డగోలుగా విమర్శిస్తుంటారని ఆరోపించారు. ఆఖరికి ముక్కు కోస్తా అంటూ వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారని ఆరోపించారు. మంత్రులు,టీఆర్ఎస్ నేతలపై జాతీయ పార్టీ,ప్రతిపక్షాలు అని చెప్పుకునేవారు చేస్తున్న విమర్శలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని కేసీఆర్ అన్నారు. సోషల్ మీడియాలోనూ నీచాతి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ భవిష్యత్తులో దీన్ని సహించేది లేదని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Recommended Video
ఇకనైనా పద్దతి మార్చుకోవాలి..
తాజా మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదని.. అయినా సరే ప్రజలు భారీ విజయం కట్టబెట్టారని ఆరోపించారు. అధికారులను వాడుకున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఇతర పార్టీల్లా ఎన్నికలను తాము గేమ్గా పరిగణించలేదని, ఒక టాస్క్గా పరిగణించామని చెప్పారు. ఎన్నికల ఖర్చు విషయంలోనూ పార్టీ తరుపున రూ.80లక్షలు తప్ప అంతకుమించి ఖర్చు చేయలేదన్నారు. ఇకనైనా విమర్శలు,ఆరోపణలు చేసేవాళ్లు పద్దతి మార్చుకుని గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు.