జగన్తో దోస్తీ.. పోతిరెడ్డిపాడు జల వివాదం... తన వైఖరేంటో కుండబద్దలు కొట్టిన కేసీఆర్..
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నెలకొన్న పోతిరెడ్డి జల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలు అన్యోన్యంగా ముందుకు సాగుతూ వచ్చాయని.. ఇకముందు కూడా కలిసి ఉంటామని చెప్పారు. అయితే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. మంచిగా ఉంటే ఉంటామని.. లేదు కొట్లాటంటే కొట్లాటే అని స్పష్టం చేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో తమ మైత్రి కొనసాగుతుందని కేసీఆర్ పరోక్షంగా చెప్పారు. అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఎంతకైనా వెనుకాడమన్న హెచ్చరికలు పంపించారు.
ఇప్పటికీ అదే మాట..
నీళ్లకు సంబంధించి సంబంధించి తనకు స్పటిక సదృశ్య అవగాహన ఉందన్నారు. విషయ పరిజ్ఞానం,భౌగోళిక అవగాహన,ప్రజల అవసరాలపై పట్టింపు తనకు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరపబడ్డ కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టామని చెప్పారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని.. సముద్రం పాలయ్యే నీళ్లను రాయలసీమకు తరలించడంలో తప్పేమీ లేదని.. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అయితే అలా కాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను తీసుకుపోవడాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.
చిల్లర పంచాయతీలతో సాధించేది తక్కువ..
'బేసిన్లు లేవు,భేషజాలు లేవు అని నేనే గతంలో చెప్పాను. రెండు రాష్ట్రాలకు సరిపోను 1000 టీఎంసీలు ఉన్నాయి. పిచ్చి కొట్లాటలు బంద్ చేయాలని ఎప్పటి నుంచో అంటున్నాం. ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు బస్తీమే సవాల్ అనేవారు. బాబ్లీ ప్రాజెక్టుపై లేని కొట్లాట పెట్టుకున్నారు. దాంతో సాధించేది ఏమైనా ఉందా. సాగునీరు కనీసం ఒక్క బొట్టైనా సాధించారా..? చిల్లర పంచాయతీలతతో సాధించేది తక్కువ. కానీ, మేము అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంతో మాట్లాడి సామరస్యపూర్వకంగా పరిష్కరించాం. అధికారులు 30 నుంచి 40 సార్లు తిరిగారు. చివరికి సాధించాం. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీలను సేకరించి చక్కగా పంటలను పండించుకుంటున్నాం.' అని చెప్పుకొచ్చారు.
Recommended Video
కృష్ణ జలాలు వాడుకుంటామంటే ఊరుకోము..
పోతిరెడ్డిపాడుపై తాను అరవీర భయంకరంగా కొట్లాడానని.. ప్రతిపక్షాలకు ఏ అంశం ఎత్తుకోవాలో కూడా తెలియదని కేసీఆర్ అన్నారు. జీవో విడుదలైన విషయం తెలిసిన ఐదు నిమిషాలకే నిరసన తెలిపామన్నారు.రాయలసీమకు కూడా నీళ్లు వెళ్లాలని తాను గతంలో కూడా చెప్పానని.. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నానని చెప్పారు. తమకు రెండు నాలుకలు లేవన్నారు. కానీ కృష్ణా జలాలను వాడుకుంటామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇక గోదావరి జలాలకు సంబంధించి నికర జలాలే కాకుండా మరో 650 టీఎంసీల మిగులు జాలలను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.