కెసిఆర్కు లేఖ రాసి నిధులు తెచ్చుకున్న 10వ తరగతి విద్యార్థి
వరంగల్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాసి.. తమ తండాకు రోడ్డుకు నిధులు మంజూరు చేయించుకున్నాడు ఓ విద్యార్థి. అతని పేరు గణేష్. వర్షాకాలం వస్తే తమ తండా పరిస్థితి దారుణంగా ఉంటుందని, తమ తండాలో రోడ్డుకు నిధులు కావాలని గణేష్ సీఎం కెసిఆర్కు లేఖ రాశాడు.
దానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించారు. తండా రోడ్డుకు నిధులు మంజూరు చేయించుకున్నాడు. గణేష్ వరంగల్ జిల్లా జనగామలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడిది లోతు వర్రె తండా. పాలకుర్తి మండలంలో ఉంటుంది. తల్లిదండ్రులు వ్యవసాయదారులు.
గణేష్ జనగామలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. సీఎం కెసిఆర్కు గత ఏడాది అక్టోబర్ నెలలో గణేష్ ఉత్తరం రాశాడు. తాను, తన మిత్రులు, తండా వాసులు అనుభవిస్తున్న కష్టాలు అందులో పూసగుచ్చాడు. టీచర్ వెంకటరమణ సహకారంతో జనగామలో తెలంగాణ సీఎం పేరిట ఉత్తరాన్ని 2015 అక్టోబర్ 18న పోస్ట్ చేశాడు.
ఇది తన దృష్టికి రాగానే సీఎం కెసిఆర్ కదిలారు. ఆ ఉత్తరం కెసిఆర్ను కదిలించింది. సీఎం కెసిఆర్ స్పందించడం, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించడం, తర్వాత పంచాయతీరాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆదేశాలివ్వడం రూ.67 లక్షల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అవడం చకచకా జరిగిపోయాయి. దాంతో గణేష్తోపాటు తండా వాసులంతా సంబురాల్లో మునిగిపోయారు.
ఎరువుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేస్తాం: దత్తాత్రేయ
మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కర్తాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరవు జిల్లాల్లో ఉపాధిహామీ పథకం పనిదినాలు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా తయారీ కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్నగర్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.