ఉద్యమం టైంలో అందర్నీ తిట్టా, బాబు రెచ్చగొట్టారు: కెసిఆర్, రోహిత్ మృతిపై...
హైదరాబాద్: భాగ్యనగరంలోని కన్నడిగులు, బెంగాళీలు, గుజరాతీలు, ఆంధ్రావారు అందరూ తమకు బిడ్డలేనని, ఉద్యమం సమయంలో పరుషంగా మాట్లాడిన మాటలు నిజమేనని, కానీ ఇప్పుడు తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని బిడ్డలుగానే చూస్తామని, వివక్ష చూపించమన్నారు.
వి హనుమంత రావు, కాంగ్రెస్ ఇతర నేతలు తాను గతంలో చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారని, కానీ నాడు ఉద్యమం సమయంలో అలాంటి వ్యాఖ్యలు మాట్లాడనని చెప్పారు. లంకలో పుట్టిన వారంతా రాక్షసులని, తెలంగాణను వ్యతిరేకించే వారిని సన్నాసులు, బద్మాష్లు అన్నానని, తాను కేవలం ఆంధ్రా వారినే తిట్టలేదని, తెలంగాణ వాళ్ళని కూడా అన్నానని చెప్పారు.
ఉద్యమ నాయకుడిగా మాత్రమే అలా చెప్పానన్నారు. తెలంగాణ రాగానే.. తాను ఓ విషయం చెప్పానని, నిన్నటి దాకా తమది ఉద్యమ పార్టీ అని, ఇప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పానని గుర్తు చేశారు. హైదరాబాదులోని వారంతా మా బిడ్డలే అన్నారు. అందరూ ఇక్కడ సంతోషంగా ఉండవచ్చునని చెప్పారు.
హైదరాబాదులో నివసించే వారు ఎక్కడి వారు అయినా తనకు అనవసరమని, తాము హైదరాబాదీలం అని చెప్పుకుంటే చాలన్నారు. పద్దెనిమిది నెలల్లో ఎవరికైనా ఇతర ప్రాంతాల వారికి ఇబ్బంది కలిగిందా అన్నారు.
చంద్రబాబు సెక్షన్ 8 గురించి మాట్లాడారని, ఆయన లాంటి వారు లేని ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. నాలుగు ఓట్ల కోసం కక్కుర్తి పడి హైదరాబాద్ ప్రశాంతతను భగ్నం చేయవద్దన్నారు. హైదరాబాదులోని అందరికీ అన్ని పథకాలు సమానంగా వర్తింప చేస్తామన్నారు. హైదరాబాదులో నివసించే వారందరికీ సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
మేం పొలిటికల్ టెర్రరిజానికి పాల్పడుతున్నామని అనడం సరికాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా అంటే రాజకీయ తీవ్రవాదులు ఎవరో అందరికీ తెలుసునని చెప్పారు. హెచ్సియులో రోహిత్ ఆత్మహత్యపై రెండో మాటల్లో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలన్నారు.