TSRTC Strike: ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం: కేసీఆర్ కీలక సమీక్ష, ఛార్జీలు పెంచడమే మార్గమా?
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటామంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటన చేసిన నేపథ్యంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కార్మికులను విధుల్లోకి తీసుకోవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఈ సమావేశం ముగియడం గమనార్హం.
సుదీర్ఘ అధ్యయనం
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశాలతోపాటు జేఏసీ నేతల ప్రతిపాదనలపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఆర్టీసీపై కీలక చర్చ..
ఆర్టీసీకి ఇప్పటికే రూ. 5వేల కోట్లకుపైగా అప్పులున్నాయని, తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ. 2వేల కోట్ల వరకు ఉన్నాయని.. సమావేశంలో సీఎం తెలిపారు. ఇంకా, ప్రావిడెండ్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ. 240 కోట్లు కావాలని అన్నారు. వాస్తవ పరిస్థితుల ప్రతిపాదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ పరిస్థితి లేదు..
సీపీఎస్కు రూ. 500 కోట్లు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉంది. పీఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు రూ. 65-70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లుగా నడవాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాలని వివరించారు. ఈ భారమంతా ఎవరు భరించాలి? ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వ కూడా భరించే పరిస్థితి లేదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఛార్ఝీలు పెంచడమేనా?
అయితే, కొంత ప్రభుత్వం సహాయం చేసినా.. అంది ఎంత వరకు కొనసాగుతుంది. ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడం. ఛార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు అని సీఎం కేసీఆర్ తోపాటు సమావేశం ఈ మేరకు అభిప్రాయపడింది.
హైకోర్టు తీర్పు తర్వాతే..
రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో ఆ తర్వాత అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే హైకోర్టు తీర్పును బట్టి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందనేది అర్థమవుతోంది.