కేసీఆర్కు మరో షాక్: ‘వెలమ’ అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలం
ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్తల జన్మస్థానమైన మహారాష్ట్రతో సుదీర్ఘమైన సరిహద్దులు పంచుకుంటున్నా.. ఉత్తర తెలంగాణలో తొలి నుంచీ కాషాయ అనుకూలత ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ పటిష్టం కావడానికి, అధికారాన్ని చేపట్టగలమన్న విశ్వాసం పెరగడానికి ఇన్ని దశాబ్దాల కాలం పట్టింది. జనసామాన్యంలో తనపై ఉన్న 'ఉత్తరాది బ్రాహ్మణ-బనియా పార్టీ' ముద్రను చెరిపేసుకోడానికి బీజేపీ గడిచిన 20ఏళ్లలో కీలకమైన కులసమీకరణలతో ముందుకెళ్లింది. అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో ఇప్పుడు మరోసారి కమలనాథులు తమవైన కుల ఎత్తుగడలను అమలుచేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో రెండు ప్రధాన కులాలైన వెలమ, రెడ్డి సమాజికవర్గాలను కలుపుకొనిపోయేందుకు సమాయత్తం అయ్యారు..
Recommended Video
షాకింగ్: బీజేపీతో టీఆర్ఎస్ సంధి? -హైదరాబాద్కు కేసీఆర్, ఢిల్లీకి బండి సంజయ్ -ఏం జరుగుతోంది?
తొలుత బీసీలు, ఇప్పుడు ఓసీలు
రాష్ట్రంలో జనాభా, రాజకీయ క్రియాశీలత పరంగా బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి పెద్ద పీట వేయడం ద్వారా బీజేపీ బీసీలను ఆకట్టుకోగలిగింది. కాపు సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్ ను ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా బీసీనే కావడం, ప్రస్తుతం ఆయన జాతీయ బీసీ మోర్ఛాకు అధ్యక్షుడు కావడం తెలిసిందే. తెలంగాణలో అధికార పార్టీ వెంట వెలమ సామాజికవర్గం ఉండగా, రెడ్లు మొన్నటివరకూ కాంగ్రెస్ వైపు ఉన్నారనేది బహిరంగ రహస్యమే. రెండ్ల ఆధిపత్యంలోని కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బలహీనపర్చడంతో ఇప్పుడా సామాజికవర్గంలోని బలమైన నేతలకు బీజేపీ బంపర్ ఆఫర్లు ఇస్తున్నది. డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఒక ఉదాహరణ. రెడ్లతోపాటే వెలమల్లోనూ తమ బలాన్ని పెంచుకోడానికి బీజేపీ ప్రయత్నాలను ముమ్మరంచేసింది.
కేసీఆర్పై వెలమ అస్త్రం
నిజానికి చెన్నమనేని విద్యాసాగర్ రావు లాంటి వెలమ నేతలు సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, భారీ విజయాలు కూడా సాధించినప్పటికీ, గతంలో చాలా జిల్లాల్లో వెలమ నేతలే బీజేపీకి సారధ్యం వహించినప్పటికీ కేసీఆర్ ఎదుగుదల తర్వాత వెలమలు పూర్తిగా టీఆర్ఎస్వైపు మొగ్గుచూపారు. కేసీఆర్ సొంత కులాన్ని తిరిగి కమలం వైపునకు ఆకర్షించేలా బీజేపీ ప్రణాళికలు అమలు చేస్తున్నది. అందులో భాగంగానే రఘునందన్ రావును చేరదీసి, ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అట్టిపెట్టుకుని, చివరికి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిపించుకుంది. తాజాగా వెలమ కులానికే చెందిన మరో కీలక నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావును కేసీఆర్ పైకి అస్త్రంగా వదిలేందుకు బీజేపీ సిద్ధమైంది..
బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు
మహారాష్ట్ర గవర్నర్ గానూ పనిచేసిన విద్యాసాగర్ రావును బీజేపీ అధిష్టానం మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి దింపింది. ఒకప్పుడు కేసీఆర్ కు సన్నిహితుడైన రఘునందన్ రావు టీఆర్ఎతో విభేధించి బీజేపీలో చేరి సుదీర్ఘ పోరాటం తర్వాత దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వెలమ నేతలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఆ సమాజిక వర్గానికి చెందిన బలమైన నేత, కేసీఆర్ కు ప్రస్తుతం అత్యంత ఆప్తుల్లో ఒకరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబాన్ని కమలం టార్గెట్ చేసింది. మంత్రి ఎర్రబెల్లి సొదరుడు ప్రదీప్ రావు అతి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవామే ఈ మేరకు బీజేపీ నేతలతో ప్రదీప్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రదీప్ రావు ప్రజారాజ్యం తరఫున పోటీచేసి విజయం వాకిట బోల్తాపడ్డారు. తర్వాతికాలంలో టీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా కొనసాగుతున్నారు.
సొంత కులంలో కలకలం రేపేలా
ఇప్పటికే కేసీఆర్ సొంత జిల్లాలో రఘునందన్ రావు బలమైన బీజేపీ నేతగా ఫోకస్ కావడంతో మిగతా జిల్లాల్లోనూ ఆ సమాజికవర్గాన్ని ఆకర్షించే నేతలను అక్కున చేర్చుకోవడంలో భాగంగానే ప్రదీప్ రావుతో కమలనాథులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ బీజేపీలో చేరితే గనుక.. ప్రాధాన్యత ఉన్న శాఖలకు మంత్రిగా కొనసాగుతోన్న ఎర్రబెల్లికి టీఆర్ఎస్ లో ఇబ్బందులు తప్పవు. గతంలో కేసీఆర్ వ్యతిరేకి అయినా.. కులం, ప్రజల్లో బలం కారణంగా ఎర్రబెల్లికి గులాబీ గూటిలో ప్రాధాన్యం దక్కింది. తన సొంత తమ్ముడినే ఆపలేని పరిస్థితిలో మంత్రి ఎర్రబెల్లి పట్ల సొంత గూటిలో మంట తప్పబోదని, సొంత కులంలోనే కుంపట్లు రేపడం ద్వారా కేసీఆర్ పై వ్యతిరేకతను బలంగా చాటాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
KCR 2.0:భారీగా పుంజుకున్న బీజేపీ -సంక్షేమాభివృద్ధిలో టాప్, అయినా ఎదురుదెబ్బలు -ఎన్నికల భయం