పెద్దల సభకు కవిత పేరు ఖరారు: కేకేకు లేనట్లేనా..రేసులో జూపల్లి: కేసీఆర్ తుది కసరత్తు..!
హైదరాబాదు: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి ఇద్దరు రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావటంతో పేర్ల ఖరారు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు చేస్తున్నారు. అందులో అనేక మంది తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించగా..ఆచి తూచి కేసీఆర్ ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ మాజీ సభ్యురాలు కవిత ను పెద్దల సభకు పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురిలో ఇద్దరు పదవీ విరమణ చేశారు. మిగిలిన ఐదుగురిలో నలుగురు బీసీలే ఉన్నారు. దీంతో..ఈ సారి కవితతో పాటుగా రెండో సీటు కోసం ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తల మధ్య పోటీ నెలకొని ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ రాత్రికి రెండు పేర్లు ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
రాజ్యసభకు కవిత పేరు ఖరారు...!
టీఆర్ఎస్ నుండి ఇద్దరు రాజ్యసభ సభ్యుల ఖరారు చివరి దశకు చేరుకుంది. తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గరికపాటి మోహనరావు..కేవీపీల పదవీ కాలం ముగియటంతో వారి స్థానంలో రెండు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా..అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ఉన్న బలంతో రెండు సీట్లు టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. ఈ రెండు సీట్లు కోసం అనేక మంది ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అయితే, ఇప్పటికే రెండు సీట్లలో ఒకటి కేసీఆర్ తనయ కవితకు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.
కవిత ఢిల్లీలో ఉండాలనే ఉద్దేశంతోనే..
2014లో నిజామాబాద్ నుండి ఎంపీగా గెలిచి లోక్ సభలో తన ప్రసంగాలతో గుర్తింపు పొందిన కవితను..రాజ్యసభకు పంపటం ద్వారా ఢిల్లీలో మరోసారి గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ నుండి మహిళా ఎంపీలు లేకపోవటంతో కవిత పేరు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇక, రెండో సీటు ఎవరికి ఇస్తారనేదే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఆసక్తి కర చర్చకు కారణమైంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే బీసీలు ఇప్పటికే నలుగురు ఉన్నారు. మరొకరికి అవకాశం ఇస్తారా లేదా అనేది చర్చకు కారణమైంది.
రేసులో జూపల్లి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు..
ఈ సారి టీఆర్ఎస్ నుండి రాజ్యసభకు వెళ్లేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మైహోం సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుతో పాటుగా నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. అయితే, సామాజిక వర్గాల అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కవితకు ఇస్తే..వీరిద్దరికీ ఛాన్స్ ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో కే కేశవరావు, వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అందులో పొంగులేటి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్దుల గెలుపు విషయంలో సహకరించలేదనే కారణం తో ఆయనకు ఛాన్స్ లేదనే వాదన ఉంది.
Recommended Video
కేకేకు కష్టమే.. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు కూడా
ఇక, మున్నూరు కాపు వర్గానికి చెందిన కే కేశవరావు కు పార్టీలో కీలక బాధ్యతలు ఉండటంతో..ఆయనకు ఈ సారి రెన్యువల్ కష్టమనే భావన పార్టీలో నెలకొని ఉంది. ఇదే సమయంలో నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ సీటు కూడా భర్తీ చేయాల్సి ఉండటంతో..ఆ స్థానం మైనార్టీ వర్గానికి ఇచ్చి..సురేష్ రెడ్డిని రాజ్యసభకు పంపుతారా అనే సమీకరణం కూడా తెర మీదకు వచ్చింది. మొత్తానికి టీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులు ఎవరనేది ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్ధినీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయనున్నారు.