ఎప్పట్నుంచో నిఘా, తీగ లాగి.. అవినీతి డొంకను కదిలించిన సీఎం కేసీఆర్, అధికారులకు ముచ్చెమటలు
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తీవ్రంగా పరిగణిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దీనిపై ఎప్పటినుంచో నిఘా వేసినట్లు తెలుస్తోంది. అందుకే తన దృష్టికి వచ్చిన అక్రమాలపై కూపీ లాగించి, డొంకంతా కదిలేలా చేస్తున్నారు.
హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తీవ్రంగా పరిగణిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. దీనిపై ఎప్పటినుంచో నిఘా వేసినట్లు తెలుస్తోంది. అందుకే తన దృష్టికి వచ్చిన అవినీతి, అక్రమాలపై కూపీ లాగించి, డొంకంతా కదిలేలా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వాణిజ్యపన్నుల శాఖలో బోధన్ చలాన్ల స్కాం, రవాణా శాఖలో సెకండ్ వెహికిల్ కుంభకోణం, తాజాగా మియాపూర్ లో ప్రభుత్వ భూముల బూటకపు రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటపడినట్లు సమాచారం.
స్వయంగా పర్యవేక్షిస్తూ...
ఏ శాఖలోనైనా అవినీతి ఉన్నట్లు కాస్త ఉప్పందినా.. సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ, బాధ్యులపై తగిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎం తీరు గమనిస్తే ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుతున్న ప్రభుత్వ శాఖల ప్రక్షాళనపై ఆయన సీరియస్గా ఉన్నారని అర్థమవుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని సీనియర్ అధికారులే ఒప్పుకుంటున్నారు.
అన్ని శాఖల్లో ప్రక్షాళన...
వాణిజ్యపన్నుల శాఖ, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల్లో అవినీతిని పూర్తిగా రూపుమాపి, రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచడానికి సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రక్షాళన చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు సీఎం తన చర్యల ద్వారా సంకేతాలిచ్చినట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులంటున్నారు.
ప్రజాధనం నేరుగా ఖజానాకే...
ప్రజల సొమ్ము అవినీతి అధికారుల జేబులకు పోకుండా నేరుగా ఖజానాకు చేరితే రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 17% నుంచి మరింత పెరిగే అవకాశముందన్న కోణంలో సీఎం అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారని వారు చెప్తున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ శాఖల నుంచి రాష్ట్ర ఖజానాకు ఏటా దాదాపు రూ.50 వేల కోట్ల రాబడి వస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ శాఖల రాబడి పెరిగి రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచింది. దానికి మించి ఈసారి 17.5% వృద్ధిరేటు వచ్చింది.
చిన్నదైనా పెద్ద కర్రతో...
ఖజానాకు రాబడి మరింత పెంచాలంటే పన్ను ఎగవేతలు, లీకేజీలు నివారించడంతోపాటు శాఖల్లో అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఏ మాత్రం అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నా ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తోంది.
కఠిన చర్యలు, బదిలీలు...
రవాణాశాఖలో సెకండ్ వెహికిల్ కుంభకోణంలో పదిమంది సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరో 73మందిపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. చలాన్ల కుంభకోణంలో నిందితుల నుంచి సొమ్ము రాబట్టడానికి అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. రూ.65 కోట్ల గోల్మాల్లో ఇప్పటికే రూ.30 కోట్లు వసూలుచేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి పాల్పడిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక అన్ని రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్లలో భారీ స్థాయిలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖలో మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్లకుగాను 72 మందిని బదిలీ చేయడం విశేషం.
పేషీల్లోను ప్రక్షాళనకు చర్యలు...
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ ఎత్తున చోటుచేసుకున్న భూ కుంభకోణం వెనుక ఎవరైనా బడా అధికారుల హస్తం ఉందా? మంత్రి, ఉన్నతాధికారుల పేషీల్లో ఏం జరుగుతోంది? అనే విషయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే వారికి ఎవరైనా అండగా నిలిచారా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.