అర్థాయుష్షుతో మరణించిన రాక్షసులు వారేనా ? యూనియన్ లీడర్లు టార్గెట్గా కేసీఆర్ పిట్టకథ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమైన యూనియన్ల పై సీఎం కేసీఆర్ ఉక్కు పాదం మోపారు. ఆర్టీసీ కార్మికులకు యూనియన్ లతో పనిలేదని ఏది చెప్పాలన్నా తనతో డైరెక్ట్ గా మాట్లాడమని తేల్చి చెప్పారు. యూనియన్ నాయకులు తీరుపై పిట్టకథ చెప్పిన కేసీఆర్ రెండేళ్లపాటు యూనియన్ ఎన్నికలు రద్దు చేస్తూ ప్రకటన చేసి ఆర్టీసీ యూనియన్లకు షాక్ ఇచ్చారు.
ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్
ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోలా తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని దేశంలోనే ఎక్కడా లేని విధంగా యాభై రెండు రోజులపాటు సమ్మె చేశారు. చివరకు సీఎం కేసీఆర్ తో గెలవలేక నాలుగడుగులు వెనక్కి తగ్గిన కార్మికులు ఏ డిమాండ్లు పరిష్కారం కాకున్నా సమ్మె విరమించి విధుల్లో చేరారు.
ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమావేశం .. కలిసి భోజనం
ఒక దశలో ఉద్యోగులందరూ సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పి డిఫెన్స్ లో పడేసిన కేసీఆర్, తిరిగి విధుల్లోకి చేర్చుకుంటారో,చేర్చుకో రో అని ఆందోళన చెందిన సమయంలో పీక్స్ వరకు టెన్షన్ పెట్టి ఫైనల్ గా విధుల్లో చేరండి అని చెప్పారు కేసీఆర్. అంతేకాదు యూనియన్ లను నమ్ముకుంటే నట్టేట మునుగుతారని,తనను నమ్ముకుంటే సింగరేణి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం కేసీఆర్ కార్మికులకు చెప్పారు. ఏకంగా కార్మికులతో కలిసి ఆత్మీయ భోజనం చేస్తానని డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులను ఆహ్వానించారు.కార్మిక నాయకులతో మాత్రం చర్చించేది లేదని తేల్చిపారేశారు.
రెండు గంటలపాటు మాట్లాడిన కేసీఆర్ .. యూనియన్ నాయకులే టార్గెట్ గా పిట్ట కథ
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు. రెండు గంటల పాటు సాగిన కేసీఆర్ ప్రసంగం మానవీయ కోణంలో సాగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు, అక్కడ ఉన్న కార్మికులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్య మధ్యలో ఆయన విసిరిన చలోక్తులు,సందర్భోచితంగా చెప్పిన పిట్ట కథలు, వేసిన సామెతలు అందరిని ఒక ఆహ్లాద వాతావరణం లోనికి తీసుకు వెళ్ళాయి. ఇక ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక పిట్ట కథ యూనియన్ నాయకులను టార్గెట్ చేస్తూ సాగింది.
యూనియన్ నాయకులను రామాయణ యుద్ధంలో మరణించిన రాక్షసులతో పోల్చిన సీఎం
సీఎం కేసీఆర్ రామాయణం లోని ఒక కథను చెప్పి ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టే వాళ్ళు ఉంటారని పేర్కొన్నారు. ఇక ఆ కథ విషయానికి వస్తే యుద్ధంలో రామబాణం వల్ల అర్థాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏంటని రాముడిని అడిగారట. కలియుగంలో మీరు అక్కడక్కడ పుట్టండి అని వారికి చెప్పాడట రాముడు. అలా నాడు రామాయణ యుద్ధంలో మరణించిన రాక్షసులే ఇప్పుడు పుట్టి మనుషులను పీక్కు తింటున్నారు.ఇక వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అని, పరోక్షంగా యూనియన్ నాయకులను రామాయణంలో యుద్ధంలో మరణించిన రాక్షసులతో పోల్చి చెప్పారు సీఎం కేసీఆర్.
యూనియన్ నాయకులకు చెక్ .. కార్మికులకు చేరువ వ్యూహం
యూనియన్ నాయకులను పూర్తిగా దూరం పెట్టి, కార్మికులకు దగ్గర కావడానికి ఆత్మీయ సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను యూనియన్ నాయకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె,ఆర్టీసీ కార్మికుల మరణాలు అంతా యూనియన్ నాయకుల వల్లే అన్నట్టుగా సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో టార్గెట్ యూనియన్స్ అన్నారు.
యూనియన్లకు రెండేళ్ళు ఎన్నికలు రద్దు చేసి నాయకులకు షాక్
ఆయన అనుకున్న విధంగానే యూనియన్ లను కార్మికులకు దూరం చేయడంలో నిన్నటి ఆత్మీయ సమావేశం ద్వారా సక్సెస్ అయ్యారు. ఆర్టీసీ కార్మికులకు వరాల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్ లాభాల బాటలో ఆర్టీసీని ముందుకు నడిపించటానికి కృషి చేస్తానని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని , అయితే తనను మాత్రమే నమ్మాలని కార్మికులకు చెప్పారు. యూనియన్లకు రెండేళ్ళ పాటు ఎన్నికలను రద్దు చెయ్యాలని ప్రకటించారు. కార్మిక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చెయ్యాలని చెప్పి గట్టి దెబ్బ కొట్టారు.