దేశంలోనే తొలిసారి .. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ పాస్ బుక్ .. సీఎం కేసీఆర్ నిర్ణయం
కొత్త మున్సిపల్ చట్టం ద్వారా, మున్సిపాలిటీల పరిధిలో స్థలాలు,ఇళ్ళు క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, రెవెన్యూ చట్టం ద్వారా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలోని పొలాలను, స్థలాలను, ఇళ్లను అన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రతి ఒక్క దానికి లెక్క పక్కాగా ఉండాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆన్లైన్లో గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఉన్న ఇళ్ల వివరాలు నమోదు చేస్తున్నారు అధికారులు. ఇక తాజాగా మరో సంచలన విషయం వెల్లడించారు సీఎం కేసీఆర్ .
Recommended Video
వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ కు జంతర్ మంతర్లో ధర్నా చేసే దమ్ముందా .. రేవంత్ సవాల్ .. ఉత్తమ్ ఫైర్
వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టాదారు పాసుపుస్తకాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయేతర ఆస్తులకు కూడా ప్రతి వ్యక్తికి పట్టాదారు పాసు పుస్తకాలను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారికి మెరూన్ కలర్ పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తామని కెసిఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ ప్రారంభం అయిన తర్వాతనే వ్యవసాయ ఆస్తుల,వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కెసిఆర్ తెలిపారు.
ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశంలో కీలక ప్రకటన
భూ వివాదాలు, ఘర్షణలు, సంవత్సరాల తరబడి వివాదం కాని ఎన్నో భూ పంచాయతీలను పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలకు దిగినట్లుగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద,మధ్యతరగతి ప్రజల భూములకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల విషయంలో మెరూన్ కలర్ పాస్ బుక్ ఇవ్వడం ద్వారా ఆస్తులపై పక్కాగా పాసుపుస్తకం ఉన్నవారికి హక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్లా అన్ని ఆస్తులు ఆన్ లైన్ లో
ఇప్పటికే కెసిఆర్ గ్రామాలలోనూ, పట్టణాలలోనూ,అన్ని ఇళ్ళ వివరాలను, ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంటి నెంబర్ కేటాయించాలని, పన్నులు పక్కాగా వసూలు చేయాలని కూడా కేసీఆర్ తెలిపారు. దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు,ఎఫ్ టి ఎల్, నాలా,యు ఎల్ సి పరిధిలో ఉన్న ఇళ్లకు మ్యుటేషన్ వర్తించదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆస్తుల నమోదు, క్రమబద్దీకరణ, ఉచిత నాలా కన్వర్షన్ ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిఒక్కరు మ్యూటేషన్ చేయించుకోవాల్సిందే..
ఇక ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ప్రజలకు అర్థమయ్యే భాషలో అటు ఇంగ్లీషులోనూ, ఇటు తెలుగులోనూ విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఆస్తులన్నింటినీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో మ్యుటేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిన కేసీఆర్ రాష్ట్రంలో ఇకపై ఏ తరహా రిజిస్ట్రేషన్ అయినా ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్తుల లెక్కలు తేల్చే పనిలో పడ్డారు.