బయ్యారంపై త్వరలో మోడీ నిర్ణయం, బాగుందని స్మితా సబర్వాల్ చెప్పారు: కెసిఆర్
ఖమ్మం: బయ్యారం ఉక్కు పరిశ్రమ పైన ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని, త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం చెప్పారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న కెసిఆర్ విలేకరులతో మాట్లాడారు.
ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాల్సి ఉందని చెప్పారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పైన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించానని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని చెప్పారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్నిచోట్ల వర్షపాతం ఉన్నా మరికొన్ని చోట్ల కరవు నెలకొందన్నారు.
పారిశ్రామిక విధానంలో ప్రపంచంలోనే మనం ముందున్నామని కెసిఆర్ చెప్పారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని డెడ్ లైన్ లోపు పూర్తి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని ఆఫీసర్ స్మితా సబర్వాల్ చెప్పారన్నారు.
అక్టోబర్ నాటికి పాలేరు సెగ్మెంటులో మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారని చెప్పారు. జిల్లాలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం టిఎస్ ఐపాస్కు మంచి స్పందన వస్తోందన్నారు.
సస్యశ్యామలం చేసేందుకే సీతారామ ప్రాజెక్టు
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు వేరుగా అన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే సీతారామా ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్, అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో మేదోమథనం జరిగిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిందన్నారు. ఫిబ్రవరి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించారన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సీఎం రేపు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.